Film Reviews: రివ్యూలతో సినిమాను చంపేస్తారా? సీఎంకి డైరెక్టర్ ఫిర్యాదు!

Pongala Director

Pongala Director

మలయాళ సినీ పరిశ్రమలో రివ్యూల అంశం మీద ఏకంగా ఒక దర్శకుడు ఆ రాష్ట్ర సీఎంను కలిశారు. క్రిటిక్స్ ముసుగులో సినిమాలను ఎగతాళి చేయడం, సినిమా టీంను అవమానించడం, సినిమా విడుదలైన మొదటి రోజే నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం వంటి అంశాలపై పరిశ్రమ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ ఏబీ బినీల్ కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీసన్‌ను స్వయంగా కలిసి, చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను, సినిమా రివ్యూల వెనుక ఉన్న చీకటి కోణాన్ని బినీల్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఈ సమావేశంలో డైరెక్టర్ బినీల్ ముఖ్యమంత్రికి తన వ్యక్తిగత అనుభవాన్ని వివరించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘పొంగాల’ థియేటర్లలో విడుదలైనప్పుడు తీవ్రమైన నెగిటివ్ రివ్యూలను, ట్రోలింగ్ ఎదుర్కొంది. కంటెంట్‌ను చూడకుండానే కొందరు సోషల్ మీడియా వేదికగా సినిమాను దారుణంగా ట్రోల్ చేశారని ఆయన అంటున్నారు. ఇక ఇదిలా ఉండగా అదే సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో విడుదలైనప్పటి నుండి గత రెండు వారాలుగా దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందనను రాబడుతోంది. భారతదేశంలోని టాప్ యాక్షన్ చిత్రాల జాబితాలో ‘పొంగాల’ గత రెండు వారాలుగా 9వ స్థానంలో ట్రెండ్ అవుతూ సంచలనం సృష్టిస్తోంది. “ఒక సినిమా యొక్క నిజమైన విలువ ఏంటనేది మొదటి కొన్ని రోజుల సోషల్ మీడియా తీర్పులు లేదా పెయిడ్ రివ్యూల ద్వారా నిర్ణయించబడదని నా సినిమా నిరూపించింది” అని బినీల్ స్పష్టం చేశారు.

×
×
Ad

కళాభివృద్ధికి, సినిమా ఎదుగుదలకు ఆరోగ్యకరమైన విమర్శలు ఖచ్చితంగా అవసరమని, కానీ క్రిటిసిజం పేరుతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను ముందే తప్పుదోవ పట్టించేలా విషం చిమ్మడం కరెక్ట్ కాదని బినీల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సినిమా వెనుక కేవలం హీరో, డైరెక్టర్ మాత్రమే ఉండరని.. వందలాది మంది దినసరి కార్మికులు, కోట్ల రూపాయల పెట్టుబడులు, వేలాది కుటుంబాల జీవనోపాధి దాగి ఉంటాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. పరిశ్రమపై ఆధారపడిన వేలాది మంది కార్మికుల ఆందోళనలను, భవిష్యత్తును ముఖ్యమంత్రి వి.డి. సతీసన్‌కు వివరించగా.. ఆయన వాటన్నింటినీ ఎంతో ఓపికగా, శ్రద్ధగా విన్నారని డైరెక్టర్ తెలిపారు. మలయాళ సినిమా ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, Responsible Review Culture తీసుకురావడానికి ప్రభుత్వం వైపు నుండి అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు బినీల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.