RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”

Jd Chakravarthy

Jd Chakravarthy

RGV: రామ్ గోపాల్ వర్మతో పనిచేసిన అనుభవాలు, ఆయన చుట్టూ ఉండే వ్యక్తుల గురించి నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ గురించి పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆర్జీవీ దగ్గర పనిచేసేవారిలో ప్రత్యేకమైన ఆలోచనా విధానం ఉంటుందని, అదే వారిని మిగతావారితో భిన్నంగా నిలబెడుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ, పూరీ జగన్నాథ్ వంటి దర్శకుల్లో ఒకే రకమైన లక్షణాన్ని తాను గమనించానని చెప్పారు. వారు తెలియకుండానే మంచి ఫిలాసఫీ చెబుతారని, వారితో మాట్లాడితే ఆ ఆలోచనా విధానం అర్థమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా తాను గతంలో రామ్ గోపాల్ వర్మను ఓ ఆసక్తికర ప్రశ్న అడిగిన విషయాన్ని జేడీ గుర్తు చేసుకున్నారు. “రాము గారు.. పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేకపోతే పిచ్చోళ్లందరూ మీ దగ్గరికే వస్తారా?” అని సరదాగా అడిగానని తెలిపారు. దానికి వర్మ కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారని చెప్పారు.

వర్మ దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరిలో జెన్యూనిటీ, బోల్డ్‌నెస్ ఉంటుందని జేడీ అభిప్రాయపడ్డారు. “ఆయన దగ్గరకు పది మంది వచ్చినా.. చివరికి ఫిల్టర్ అయి కొంతమందే మిగులుతారు. ఆ మిగిలేవాళ్లలో ఒకే రకమైన ఆలోచనా విధానం ఉంటుంది” అని అన్నారు. తాను కూడా రామ్ గోపాల్ వర్మ దగ్గర ‘శివ’ సినిమా సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరానని జేడీ గుర్తు చేసుకున్నారు. అయితే మొదట అసిస్టెంట్ డైరెక్టర్ పని గురించి తనకు ఉన్న ఊహలు వేరుగా ఉండేవని, తర్వాత సినిమా కోసం చేసే కష్టమేంటో అర్థమైందని చెప్పారు. “అసిస్టెంట్ డైరెక్టర్ అంటే హీరోయిన్లతో మాట్లాడటం లాంటి పనులు ఉంటాయని అనుకున్నాను. కానీ అసలు సినిమా పని ఎంత కష్టమో అక్కడే తెలిసింది” అని జేడీ నవ్వుతూ చెప్పారు. అలాగే ఏ రంగంలోనైనా ఒక ప్రత్యేకమైన ఆలోచనా విధానం ఉన్నవాళ్లే ఎక్కువ కాలం నిలబడతారని జేడీ ఉదాహరణగా చెప్పారు. క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్‌ను చూసి తాను ఆడటం ప్రారంభించానని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఇదే సందర్భంలో ‘సత్య’ సినిమాను మళ్లీ చూసినప్పుడు అందులో చిన్న చిన్న పాత్రలు చేసిన చాలామంది నటులు తర్వాత పెద్ద స్థాయికి ఎదిగారని జేడీ తెలిపారు. “‘సత్య’లో చిన్న పాత్రలు చేసిన వాళ్లు ఇప్పుడు ఎక్కడెక్కడో కనిపిస్తున్నారు. ‘దుబాయ్ శీను’ సినిమాలో విలన్‌గా నటించిన వ్యక్తి కూడా ‘సత్య’లో చిన్న పాత్రలో కనిపించారు” అని చెప్పారు. ఆ నటుడిని ‘దుబాయ్ శీను’ సినిమాలో విలన్‌గా తీసుకోవాలని తానే సూచించినట్లు జేడీ చక్రవర్తి వెల్లడించారు. “ఆయన ఆ పాత్రకు బాగా సరిపోతారని నేనే సజెస్ట్ చేశాను” అని తెలిపారు. జేడీ చక్రవర్తి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్జీవీ సినిమాల ద్వారా వెలుగులోకి వచ్చిన పలువురు ప్రతిభావంతుల గురించి మరోసారి చర్చ జరుగుతోంది.