ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే భావోద్వేగ కథలతో తనదైన ముద్ర వేసే టాలెంటెడ్ డైరెక్టర్ ఇమ్తియాజ్ అలీ మరోసారి థియేటర్లలో సంచలనం సృష్టిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘మైన్ వాపస్ ఆవుంగా’** బాక్సాఫీస్ వద్ద విజయోత్సవంతో దూసుకెళ్తోంది. బాలీవుడ్, హాలీవుడ్ నుంచి భారీ సినిమాలు రేసులో ఉన్నప్పటికీ, వాటన్నింటినీ తట్టుకుని ఈ సినిమా సాధిస్తున్న విజయం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. విడుదలైన మొదటి రోజుల్లో నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, చూసిన ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ టాక్ ఈ చిత్ర రూపురేఖలనే మార్చేసింది. ఆరు వారాలు పూర్తయినా ఇప్పటికీ దేశవ్యాప్తంగా 450కి పైగా షోలతో పాటు విదేశాల్లోని 10 దేశాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతుండటం దీని క్రేజ్కు అద్దం పడుతోంది. ఈ ఏడాది విదేశాల్లో అత్యధిక స్క్రీన్లలో విడుదలైన హిందీ చిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 59 దేశాల్లో, దాదాపు 804 స్క్రీన్లపై ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేశారు. కేవలం ఉత్తరాదినే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా వంటి దక్షిణాది, తూర్పు నగరాల్లోనూ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.
తెలుగు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న అపూర్వ ఆదరణకు మురిసిపోయిన దర్శకుడు ఇమ్తియాజ్ అలీ ప్రత్యేకంగా హైదరాబాద్కు విచ్చేశారు. స్థానిక థియేటర్లలో అభిమానులను, ప్రేక్షకులను నేరుగా కలుసుకుని తన ఆనందాన్ని పంచుకున్నారు. “ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణే ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. మీ ప్రేమాభిమానాల వల్లే రోజురోజుకూ థియేటర్లలో షోల సంఖ్య పెరుగుతోంది. భారత్తో పాటు విదేశాల్లోనూ ఈ స్థాయి ఆదరణ లభించడం చాలా సంతోషంగా ఉంది,” అని ఇమ్తియాజ్ అలీ భావోద్వేగానికి గురయ్యారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంటోంది. హృదయానికి హత్తుకునే సన్నివేశాలు, ఆకట్టుకునే నటన ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. దిల్జిత్ దోసాంజ్, నసీరుద్దీన్ షా, శర్వరి, వేదాంగ్ రైనా తమ నటనతో మెప్పించారు. బిర్లా స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్లో మోహిత్ చౌదరి, శిబాసిష్ సర్కార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం విజయవంతమైన రన్తో థియేటర్లలో సందడి చేస్తోంది.

