టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం తిరుమల కొండపై వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి 11:05 గంటలకు కుదిరిన శుభ ముహూర్తానికి బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వివాహానంతరం నవ దంపతులు గురువారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
బెల్లంకొండ శ్రీనివాస్ స్వామి వారి దర్శనం అనంతరం మీడియాలో మాట్లాడుతూ ‘ “తిరుమల పుణ్యక్షేత్రంలో ఆ శ్రీవారి సన్నిధిలో మా వివాహం జరగడం నా పూర్వజన్మ సుకృతం. ఇది నా తల్లిదండ్రులు చేసిన అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా పెళ్లి తర్వాత స్వామి వారిని దర్శించుకున్నప్పుడు సుమారు 10 నిమిషాల పాటు ఆయన ముందు ఉండి ప్రార్థించుకునే అవకాశం దక్కింది. ఆ క్షణాలు మా జీవితంలో మర్చిపోలేనివి మా జన్మ ధన్యమైంది” అని భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీవారి ఆశీస్సులతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
