TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!

Tftdda

Tftdda

​TFTDDA Dispute: తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో చెలరేగిన వివాదంపై కూకట్‌పల్లిలోని రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అసోసియేషన్ పేరుతో నకిలీ పత్రాలు, లెటర్ హెడ్లు సృష్టించడాన్ని నిరోధించడంతో పాటు, సెప్టెంబర్ 13న నిర్వహించబోతున్న జనరల్ బాడీ సమావేశాన్ని నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఇంజంక్షన్ (స్టే) విధిస్తూ తీర్పునిచ్చింది.

అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత (జానీ మాస్టర్ భార్య) ఒక వర్గంగా, రఘు మాస్టర్ నేతృత్వంలోని అడ్హాక్ కమిటీ మరో వర్గంగా విడిపోగా, కార్యవర్గంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని, ఫోర్జరీ డాక్యుమెంట్లతో బ్యాంకు ఖాతాలను మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఇరువర్గాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో పరస్పరం కేసులు కూడా  పెట్టుకున్నారు. ​ ప్రస్తుతం వి.వి. సుమలతా దేవి అధ్యక్షతన 2025-2027 కాలపరిమితికి ఎన్నుకోబడిన కార్యవర్గం చట్టబద్ధంగా కొనసాగుతున్నప్పటికీ, కొందరు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా అసోసియేషన్ ను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సుమలత తరపున పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు. నిబంధనల ప్రకారం ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఆగస్టు 30న అనధికారికంగా సమావేశం ఏర్పాటు చేసి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించుకున్నారని విమర్శించారు. అంతటితో ఆగకుండా, అసోసియేషన్ అధికారిక ఈమెయిల్ ఐడీని హ్యాక్ చేసి, జూబ్లీహిల్స్ లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు ఫోర్జరీ లేఖలు పంపి బ్యాంక్ సంతకాలు మార్చేందుకు యత్నించారని ఆరోపించారు.

​సభ్యుల సంక్షేమం కోసం కేటాయించిన సుమారు 4 కోట్ల రూపాయల నిధులను, అసోసియేషన్ భవిష్యత్తును కాపాడటానికి తక్షణమే న్యాయపరమైన జోక్యం అవసరమని బాధితుల తరఫున కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 13న ఇందిరా నగర్‌లోని హోటల్ అనుపమలో మరో సమావేశం నిర్వహించేందుకు ప్రతివాదులు యత్నిస్తున్నారని తెలిపారు. ​పిటిషనర్ సమర్పించిన సాక్ష్యాధారాలు, పోలీస్ ఫిర్యాదుల కాపీలను పరిశీలించిన జడ్జి శ్రీమతి కావ్య జాడ, ప్రతివాదుల చర్యలను ప్రాథమికంగా తప్పుబడుతూ సెప్టెంబర్ 13న ఎలాంటి జనరల్ బాడీ సమావేశం నిర్వహించకూడదని స్పష్టం చేశారు. అలాగే అసోసియేషన్ ముద్రలు, లెటర్ హెడ్లు వాడటం,  బ్యాంకులు, ఇతర అధికారులకు ఎలాంటి లేఖలు రాయకుండా వారిపై నిషేధం విధిస్తూ ఆదేశాలిచ్చారు. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 12కి వాయిదా వేస్తూ, ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.