Vishwambhara: మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో – ఫాంటసీ విజువల్ వండర్ ‘విశ్వంభర’ రిలీజ్కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు ఉండటంతో ఈ సినిమా రిలీజ్ కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తుంది. ముందుగా ఈ మూవీని జూలైలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించినప్పటికీ, క్వాలిటీ విజువల్స్ కోసం మేకర్స్ వెనక్కి తగ్గారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ మెగా ప్రాజెక్ట్ను ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూవీ క్రియేషన్స్ ప్లాన్ చేస్తోందట. ఆ వీకెండ్లో మరే ఇతర భారీ సినిమాలు పోటీలో లేకపోవడం ‘విశ్వంభర’కు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టేందుకు కలిసొచ్చే అంశంగా ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ సినిమా బాహుబలి, పుష్ప తరహాలో రెండు భాగాలుగా రాబోతుందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చిత్ర దర్శకుడు వశిష్ట క్లారిటీ ఇచ్చారు. ‘విశ్వంభర’ సింగిల్ పార్ట్ మూవీయేనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన డిజిటల్ డీల్ను క్లోజ్ చేసే పనిలో ఉన్న నిర్మాతలు, త్వరలోనే అధికారికంగా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తుండగా, హరి గౌర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. చాలా కాలం తర్వాత మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆగస్ట్ 15న ఈ చిత్రం రిలీజ్ అయితే, ఆ లాంగ్ వీకెండ్లో మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపం చూపించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
