Memu Kapulam: ప్రముఖ రచయిత, దర్శకుడు బి.వి.ఎస్.రవి మేకర్స్లో ఒకడిగా వ్యవహరించిన సరికొత్త వెబ్ సిరీస్ ‘మేము కాపులం’. భిన్నమైన టైటిల్తో ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో హాట్ టాపిక్గా మారిన ఈ సిరీస్ గురించి తాజాగా ఆయన పాల్గొన్న ఎన్టీవీ పాడ్కాస్ట్ షోలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయనను ‘ఈ టైటిల్ కేవలం పబ్లిసిటీ కోసమే పెట్టారా? కాపులు, కమ్మలు అనే కులాల కోణంలో పెట్టారా?’ అని ప్రశ్నించగా.. “అవును, పబ్లిసిటీ కోసం కూడా ప్రేక్షకుల్లో ఒక రకమైన క్యూరియాసిటీ (కుతూహలం) క్రియేట్ చేయడం అవసరమే, అందుకే ఆ టైటిల్ పెట్టాం” అని ఆయన ఓపెన్గా ఒప్పుకున్నారు. అయితే ఈ సిరీస్ ఎలాంటి కుల వివాదాలకు తావులేకుండా, అత్యంత స్వచ్ఛంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లలో వస్తున్న వెబ్ సిరీస్లలో బూతులు, హింస, క్రైమ్ ఎక్కువగా ఉంటున్న తరుణంలో ‘మేము కాపులం’ వాటికి పూర్తి భిన్నంగా ఉంటుందని బి.వి.ఎస్. రవి హామీ ఇచ్చారు. ఈ సిరీస్ కుటుంబమంతా కలిసి చూడదగ్గదని చెబుతూ.. “ఈ సిరీస్ని మీ పిల్లలతో, తల్లిదండ్రులతో, భార్యాభర్తలతో, స్నేహితులతో కలిసి హాయిగా కూర్చొని చూడవచ్చు. మాటల్లో గానీ, విజువల్స్లో గానీ ఎలాంటి బూతు లేదా అశ్లీలత ఉండదు” అని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి క్రైమ్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉండవని.. ఇదొక అందమైన, ఆహ్లాదకరమైన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్షిప్ డ్రామా అని రవి వివరించారు. ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా ఎంజాయ్ చేస్తూ ఈ సిరీస్ను చూడవచ్చని చెప్పారు. ఒకసారి దర్శకుడైన తర్వాత మళ్లీ ఒక స్టెప్ వెనక్కి వేసి రైటర్గా కొనసాగడం కష్టమేనా అనే ప్రశ్నకు రవి ప్రాక్టికల్గా సమాధానమిచ్చారు. “దర్శకత్వం చేసినా చేయకపోయినా.. ఇంట్లో బిల్స్ రావడం ఆగవు కదా!” అంటూ సినిమా పరిశ్రమలో మనుగడ సాగించడానికి వచ్చే అవకాశాలను గౌరవించడమే ముఖ్యమని చెప్పారు.
