కోర్టు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రోషన్, శ్రీదేవి మరోసారి జంటగా నటించిన తాజా చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ఈ సినిమాని తెరకెక్కించాడు. కోన వెంకట్ తన ‘కోన వెంకట్ ఫిలిం కార్పొరేషన్’ బ్యానర్ మీద తన కుమార్తెలిద్దరినీ నిర్మాతలుగా పరిచయం చేస్తూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఏ ఒక్కరినీ ఆకట్టుకోలేకపోయింది. “అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లే, అవుట్ డేటెడ్ స్టోరీ లైన్” అంటూ రివ్యూస్ లో సినిమాని ఏకిపారేశారు రివ్యూ రైటర్లు.
అయితే ఇదే విషయం మీద, నిన్న సక్సెస్ కాకపోయినా సక్సెస్ మీట్ నిర్వహించుకున్న సినిమా టీం బాగా ఫైర్ అయింది. అందరూ కూడబలుక్కుని రివ్యూ రైటర్ల గురించి మాట్లాడాలి అనుకునే వచ్చినట్లుగా, దాదాపుగా అందరూ రివ్యూ రైటర్లపై విమర్శలు గుప్పించారు. దర్శకుడు అయితే “మీ రివ్యూలు మాకు మరణ శాసనాలు” అంటూ భారీ డైలాగులు కూడా వాడారు. వాస్తవానికి సినిమా బాగుంటే బాగుందని, లేదంటే లేదని రివ్యూ రైటర్లు తమ రివ్యూలలో మెన్షన్ చేస్తూ ఉంటారు. అలాగే అన్ని రివ్యూలు ఏకపక్షంగా బాగుందనో, బాగోలేదనో చెప్పడం కూడా చాలా తక్కువ సందర్భాల్లోనే చూస్తూ ఉంటాం. అయితే ‘బ్యాండ్ మేళం’ విషయానికి వచ్చేసరికి సినిమా బాలేదని ముక్తకంఠంతో దాదాపు అన్ని వెబ్సైట్స్ తేల్చి పడేసాయి. ఒకరిద్దరు తప్పుగా రాస్తే అనుకోవచ్చు, కానీ అన్ని వెబ్ సైట్స్ ఏమీ సదరు సతీష్ మీద, లేదా కోన వెంకట్ మీద కక్ష కట్టి నెగటివ్ రివ్యూస్ రాయరు కదా. అయితే దీన్ని నిర్మాణాత్మకంగా, వివరణాత్మకంగా రాసిన వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. ఆ విషయం పట్టించుకోకుండా దర్శకుడు సహా సినిమాలో నటించిన కొంతమంది నటీనటులు సైతం రివ్యూ రైటర్ల మీద విరుచుకుపడ్డారు. సినిమా బాగుంటే దాన్ని పనిగట్టుకొని విమర్శించాల్సిన అవసరం రివ్యూ రైటర్లకు లేదు. ఒకరైతే “రివ్యూ రైటర్లను మేనేజ్ చేయలేదా?” అంటూ కోన వెంకట్ నే ప్రశ్నించారు. ఆయన దానికి “లేదని” సమాధానం చెప్పారు. నిజానికి రివ్యూ రైటర్లను మేనేజ్ చేసే పరిస్థితి ఉంటుందా అంటే, అది లేదనే దాదాపుగా సినీ పరిశ్రమలో ఉన్న అందరికీ తెలుసు.
ఇక్కడ ఉన్న పరిచయాల కొద్దీ తమకు బాగా తెలిసిన దర్శకులు, నిర్మాతలు లేదా నటీనటుల సినిమాలకు కొంతమేర నెగెటివిటీ తగ్గించి రివ్యూ రాయగలరేమో కానీ, బాలేని సినిమాని బాగుందని రాస్తే ఆయా వెబ్సైట్లకు క్రెడిబిలిటీ పడిపోతుంది; కాబట్టి ఎవరూ అంత సాహసానికి పూనుకోరు.
కానీ ఇదే జంట హీరో హీరోయిన్లుగా నటించిన ‘కోర్టు’ సినిమాకి మాత్రం ప్రేక్షకులతో పాటు రివ్యూ రైటర్లు సైతం బ్రహ్మరథం పట్టారు. అప్పుడు వారిని ఎవరు మేనేజ్ చేసినట్టు? అంతేకాక అదే దర్శకుడికి నాని మరోసారి అవకాశం కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇదే కోన వెంకట్, ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సదరు దర్శకుడికి మరో అవకాశం ఇవ్వగలరా?
అలానే ఇటీవల రిలీజ్ అయి బ్లాక్ బస్తర్ టాక్ తో పాటు రివ్యూస్ అందుకున్న దురంధర్ విషయంలో ఎవరు ఎవర్ని మేనేజ్ చేశారో? కూడా సదరు నటీమణి మాట్లాడి ఉంటే బాగుండేది. నిజానికి ఈ సినిమాలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. అలా అని సినిమా మొత్తం తీసి పక్కన పెట్టమని ఎవరూ రివ్యూ రాయలేదు. తమకు సినిమాలో ఉన్న కంప్లైంట్స్ తమ వేదికల ద్వారా, కొంతమంది వెబ్సైట్స్ లో, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ లో వ్యక్తపరిచారు. ఆ వ్యక్తపరచడాన్ని కూడా ఈ ‘బ్యాండ్ మేళం’ టీం తట్టుకోలేకపోతోంది అంటే, వాళ్ళు ఇంకా తమ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే భ్రమ నుంచి బయటకు వస్తే బెటర్. నిజానికి బాహుబలి లాంటి సినిమాకి కూడా భారీ రేటింగ్స్ ఏమీ రాలేదు, కానీ ఆ సినిమా జనానికి నచ్చింది కాబట్టి బ్రహ్మరథం పట్టి, ఇప్పటికీ బద్దలు కొట్టలేని స్థాయిలో రికార్డులు సాధించింది. అయితే ఇదే విషయాన్ని మరిచి తమ సినిమాని మీడియానే చంపేసింది అన్నట్లుగా సదరు దర్శకుడు సహా నటీనటులు, సినిమా టీమ్ అంతా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? వారికి వారే ఆలోచించుకోవాలి.