నోరు జారితే ఎంతటి వారికైనా కష్టమే! అదీ మనకంటే ఎంతో గొప్పవారి గురించి నోరు జారితే… అది మరింత కష్టం! ఓ సారి హిమేశ్ రేషిమియాకు అదే జరిగింది. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అనూహ్యమైన క్రేజ్ ఏర్పడింది. ఆయన పాటలంటే యూత్ చెవి కోసుకునే వారు. కానీ, అదే సమయంలో కొందరు మాత్రం ముక్కుతో పాడేస్తున్నాడని ముక్కోపం ప్రదర్శించేవారు. అయితే, చాలాసార్లు ఓపిక పట్టిన హిమేశ్ ఒకసారి మాత్రం మీడియా వారి ప్రశ్నకు అసహనం పాలయ్యాడు. వెంటనే ‘ఆర్ డీ బర్మన్ కూడా ముక్కుతో పాడేవారు. ఆయన్ని ఎప్పుడూ ఎవరూ తప్పు పట్టలేదే?’ అనేశాడు! అది కాస్త పెద్ద దుమారం రేపింది!
ఆర్ డీ బర్మన్ లాంటి బాలీవుడ్ లెజెండ్ ని కొత్తగా వచ్చిన హిమేశ్ లాంటి సంగీత దర్శకుడు కామెంట్ చేయటం ఆశా భోస్లేకు కోపం తెప్పించింది. తనని లాగి పెట్టి కొట్టాలని అనుకుందట! మీడియాతో ఆమె ఆ మాట చెప్పేశారు కూడా! ఆశా భోస్లే ఆగ్రహం గురించి హిమేశ్ ముందు జర్నలిస్టులు ప్రస్థావించగా… ఈసారి మెచ్యూర్డ్ గా రియాక్ట్ అయ్యాడు. ‘పంచమ్ దా (ఆర్ డీ బర్మన్) లాంటి గొప్ప సంగీత దర్శకుడ్ని వివాదంలోకి లాగటం తప్పే! అందుకు నేను బేషరతుగా క్షమాపణ కోరుతున్నాను. లతా మంగేష్కర్, ఆశా భోస్లే లాంటి లెజెండ్స్ అంటే నాకు చాలా అభిమానం! వార్ని నొప్పించటం నా ఉద్దేశం కాదు. అందుకే, అన్ కండీషనల్ గా సారీ చెబుతున్నాను’ అన్నాడు హిమేశ్!
కెరీర్ మొదట్లో ఓ సారి నోరు జారినప్పటికీ వెంటనే ‘సారీ’తో సరిపెట్టేయటం హిమేశ్ రేషమియా తెలివైన నిర్ణయమనే చెప్పాలి. అనవసరంగా మళ్లీ మళ్లీ తనని తాను సమర్థించుకుని ఉంటే పెద్ద రచ్చే అయ్యేది! త్వరలో ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ యాక్టర్ తన కొత్త ఆల్బమ్ తో రాబోతున్నాడు. ‘సురూర్ 2021’ పేరుతో ఫ్యాన్స్ ని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు రేషమియా!