ఆగస్టు 14న ‘పాగల్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మాస్ కా దాస్ విష్వక్ సేన్. నరేష్ కుప్పిలి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ లేకుంటే ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే పాగల్ సినిమా ఓటీటీ వేదికగా విడుదల చేస్తారంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. కానీ ఆవార్తల్లో నిజం లేదంటూ సినిమాను థియేటర్స్లోనే రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ చెప్పుకొచ్చింది.
తాజాగా, విష్వక్ సేన్ మాట్లాడుతూ.. చాలా క్లిష్ట పరిస్థితుల్లో పాగల్ సినిమాని ఆగస్టు 14న థియేటర్లలో విడుదల చేస్తున్నాము. కచ్చితంగా ప్రేక్షకులంతా మమ్మల్ని ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాము. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. దిల్రాజు ఇచ్చిన ధైర్యంతోనే రిస్క్ అయినా సినిమాని థియేటర్లలో విడుదల చేస్తున్నాం.. తప్పకుండా ఈ చిత్రం అందరికి నచ్చుతుందని భావిస్తున్నాం అన్నారు.