ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ మీద అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తిని నల్గొండ జిల్లా, అల్వాల గ్రామానికి చెందిన దోరెపల్లి చంటి (30)గా గుర్తించారు. ఇతను ఇన్స్టాగ్రామ్ వేదికగా అనసూయపై వ్యక్తిగత దూషణలకు దిగడమే కాకుండా, అత్యంత అసభ్యకరమైన, అభ్యంతరకరమైన కంటెంట్ను పోస్ట్ చేస్తున్నాడని నిర్ధారించారు. గత డిసెంబర్ 2025 నుండి నిందితుడు అనసూయను సోషల్ మీడియాలో వేధిస్తూనే ఉన్నట్లు బాధితురాలి తరపు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనసూయ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడిని ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
Also Read : Tamanna Simhadri: తల్లి కాబోతున్న ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి: అసలు కుదురుతుందా?
సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 75, 79, 336(4), 351, 356, ఐటీ చట్టం (IT Act) సెక్షన్ 66E (ప్రైవసీ ఉల్లంఘన), 67 (అశ్లీల సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ప్రసారం చేయడం) వంటి సెక్షన్లు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఎవరైనా సెలబ్రిటీలను కానీ, ఇతర మహిళలను కానీ కించపరిచేలా పోస్టులు పెడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఈ అరెస్ట్ ద్వారా పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. ఫేక్ అకౌంట్ల ద్వారా పోస్టులు పెట్టి తప్పించుకోవచ్చని భావించే వారికి ఇది ఒక హెచ్చరిక.
