స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప : ది రైజ్” ఇటీవల విడుదలై అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఉత్తర భారతదేశంలోని థియేటర్లలో అద్భుతమైన బిజినెస్ చేసింది. మహమ్మారి పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నా కూడా ఈ చిత్రం ఉత్తరాదిలో 80 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అల్లు అర్జున, రష్మిక మందన్న నటనకు, మ్యూజిక్ తో దేవిశ్రీ చేసిన మ్యాజిక్ అక్కడి ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కు సంబంధించిన మరో భారీ బ్లాక్ బస్టర్ మూవీని అక్కడ విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది.
Read Also : కరోనా బారిన పడ్డ రవితేజ హీరోయిన్
తాజా అప్డేట్ ఏమిటంటే… “అల వైకుంఠపురములో” చిత్రాన్ని జనవరి 26న నార్త్లో థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్తో ‘షెహజాదాగా’ రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం ఈ సంవత్సరం చివరిలో విడుదల కానుంది. ‘అల వైకుంఠపురము’లో రీమేక్ హక్కులను మినహాయించి మొత్తం హిందీ హక్కులను గోల్డ్మైన్స్ టెలిఫిల్మ్స్కు చెందిన మనీష్ షా సొంతం చేసుకున్నారు. ‘పుష్ప’ హిందీ వెర్షన్ను విడుదల చేసిన AA ఫిల్మ్స్, గోల్డ్మైన్ టెలిఫిలిమ్స్ ఈ చిత్రాన్ని కూడా విడుదల చేయబోతున్నాయి. డబ్బింగ్ వెర్షన్ను జనవరి 26న థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్న ఆయన ఈరోజు అధికారిక ప్రకటన చేశారు. తాజాగా ‘పుష్ప’ అక్కడ అద్భుతమైన విజయం సాధించడంతో రిపబ్లిక్ డే వీకెండ్లో “అల వైకుంఠపురములోను విడుదల చేయబోతున్నారు. “అల వైకుంఠపురములో” సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా, ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. థమన్ సంగీతం అందించారు.
