Adipurush: టీజర్ ఎఫెక్ట్.. ఆదిపురుష్ వాయిదా

Adipurush Postponed

Adipurush Postponed

Adipurush Movie Postponed To Summer: రాధేశ్యామ్ డిజాస్టర్‌ అవ్వడంతో.. ప్రభాస్ నుంచి తదుపరి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. ఆ తరుణంలో తాము ‘ఆదిపురుష్’ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ ఒక గుడ్ న్యూస్ ఇచ్చారు. అయితే.. ఇప్పుడు అదే మేకర్స్ పెద్ద హ్యాండ్ ఇచ్చారు. ఈ సినిమాని మళ్లీ వాయిదా వేశారు. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ, వాయిదా పడిన విషయం మాత్రం దాదాపు కన్ఫమ్ అయినట్టు ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికిప్పుడు ఈ చిత్రాన్ని వాయిదా వేయడానికి కారణం.. సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉండటం. అలాగే, జనవరిలోపు గ్రాఫిక్స్ వర్క్ పూర్తవ్వదన్న ఉద్దేశంతోనే, వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘ఆదిపురుష్’ టీజర్‌కి ఏ స్థాయిలో వ్యతిరేకత వచ్చిందో అందరికీ తెలుసు. లైవ్ యాక్షన్ సినిమా అని చెప్పి, టీజర్‌లో మొత్తం బొమ్మలనే చూపించాడంటూ దర్శకుడు ఓమ్ రౌత్‌ని విమర్శించారు. టీజర్ ఏమాత్రం ఆకట్టుకోలేదని, గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా ఉందంటూ ఏకిపారేశారు. దీంతో, గ్రాఫిక్స్ వర్క్‌పై ఓమ్ రౌత్ మరింత కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తోంది. సహజత్వానికి దగ్గరగా ఉండేలా ఔట్‌పుట్ తీసుకొచ్చేందుకు అతడు ప్రయత్నిస్తు్న్నాడని సమాచారం. కాగా.. రామాయణం ఇతివృత్తంతో రూపొందుతోన్న ఈ సినిమాకి సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఇందులో ప్రభాస్ సరసన కృతి సనన్ కథానాయికగా (సీత పాత్రలో) నటిస్తుండగా.. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నాడు. ఇక రావణుడు పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. సమ్మర్‌కి వాయిదా పడిందని వార్తలొస్తున్నాయి కానీ, తేదీ ఎప్పుడన్నదే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.