Health Tips : వేసవి సెలవులు అంటే సరదా ప్రయాణాలు, బయట ఫుడ్, చల్లటి పానీయాలు, రాత్రిళ్లు ఆలస్యంగా మెలకువలు. అయితే ఈ చిన్న చిన్న అలవాట్లే సెలవులు ముగిసేసరికి శరీరాన్ని పూర్తిగా అలసటలోకి నెట్టేస్తుంటాయి. ముఖ్యంగా మండే ఎండల్లో ప్రయాణాలు చేసిన తర్వాత చాలా మంది గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. బయట కనిపించేది కేవలం అలసట మాత్రమే అయినా… లోపల జీర్ణవ్యవస్థ మాత్రం పూర్తిగా ఒత్తిడిలో పడిపోతుంది. ఈ పరిస్థితుల్లో చాలా మంది వెంటనే క్రాష్ డైట్లు, హార్డ్ వర్కౌట్లు మొదలుపెడతారు. ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ మాత్రం శరీరాన్ని ఇబ్బంది పెట్టేకన్నా, సమతౌల్యంలో ఉంచుకోవడం ముఖ్యమని చెబుతున్నారు.
కరీనా కపూర్కు సంవత్సరాలుగా న్యూట్రిషన్ గైడ్గా ఉన్న రుజుతా దివేకర్ ఇటీవల సోషల్ మీడియాలో పంచుకున్న కొన్ని సులభమైన చిట్కాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వేసవి తర్వాత జీర్ణవ్యవస్థను తిరిగి ఆరోగ్యంగా మార్చుకోవడానికి ఇంట్లోనే చేయగల అలవాట్లను ఆమె సూచించారు. సెలవుల్లో ఎక్కువగా వేయించిన ఆహారం, స్వీట్లు, కోల్డ్ డ్రింక్స్, టీ, కాఫీ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆమె చెబుతున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ శరీరంలో వేడిని పెంచడమే కాకుండా, గట్ హెల్త్ను కూడా దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు.
ఈ పరిస్థితిలో మధ్యాహ్న భోజనంలో చిక్కుడుకాయలను చేర్చుకోవాలని రుజుతా సూచిస్తున్నారు. క్లస్టర్ బీన్స్గా పిలిచే ఈ కూరగాయలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, అమినో ఆమ్లాలు సమృద్ధిగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుందని చెబుతున్నారు. తేలికపాటి మసాలాలతో చేసిన చిక్కుడుకూర కడుపుకు ఉపశమనం ఇవ్వడమే కాకుండా శరీరానికి శక్తిని కూడా అందిస్తుందని ఆమె అభిప్రాయపడుతున్నారు.
అలాగే సెలవుల నుంచి వచ్చేసరికి వెంటనే కఠినమైన జిమ్ వర్కౌట్లు చేయడం మంచిది కాదని ఆమె స్పష్టం చేస్తున్నారు. మొదటి కొన్ని రోజులు ఉదయం, సాయంత్రం నడకలు, తేలికపాటి యోగా, సాధారణ స్ట్రెచింగ్ వంటి వ్యాయామాలతో శరీరాన్ని మెల్లగా యాక్టివ్ చేయాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల జీవక్రియ, జీర్ణక్రియ రెండూ సమతౌల్యంలోకి వస్తాయని చెబుతున్నారు.
ప్రయాణాల్లో కూడా స్థానికంగా దొరికే సీజనల్ పండ్లను తినాలని ఆమె ప్రత్యేకంగా సూచించారు. మల్బరీ, జామ, బేరిపండు వంటి పండ్లలో నీరు, ఫైబర్ ఎక్కువగా ఉండటంతో కడుపు శుభ్రంగా ఉండేందుకు అవి సహాయపడతాయని తెలిపారు. అదే సమయంలో తక్కువ నీరు తాగడం, ఎక్కువ టీ, కాఫీ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే మామిడి పన్నా, నిమ్మ షర్బత్, మజ్జిగ వంటి సంప్రదాయ పానీయాలు వేసవిలో శరీరానికి మేలు చేస్తాయని చెబుతున్నారు.
సాయంత్రం సమయంలో చిరుధాన్యాలతో చేసిన ఆహారం తీసుకోవడం కూడా జీర్ణవ్యవస్థకు మంచిదని రుజుతా పేర్కొన్నారు. రాగి దోసె, జొన్నల వంటకాలు, మిల్లెట్ ఉప్మా వంటి తేలికపాటి ఆహారం మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాడ్ డైట్లు, డిటాక్స్ ట్రెండ్లు ఎంత వచ్చినా… భారతీయ సంప్రదాయ ఆహారంలోనే నిజమైన ఆరోగ్యం దాగి ఉందని ఈ సూచనలు మరోసారి గుర్తు చేస్తున్నాయి.
