Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!

Ragi Teepi Kudumulu

Ragi Teepi Kudumulu

Ragi Teepi Kudumulu: నేటి బిజీ లైఫ్ స్టైల్‌లో రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే ఆహారం దొరకడం కష్టమైపోతోంది. ముఖ్యంగా స్వీట్లు తినాలంటే క్యాలరీల భయం వెన్నాడుతుంది. కానీ చిరుధాన్యాల రారాజు అయిన రాగి పిండితో, పంచదారకు బదులుగా బెల్లం కలిపి చేసే ఈ ‘తీపి కుడుములు’ తింటే ఆ భయం అక్కర్లేదు. కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉండి, శరీరానికి తక్షణ శక్తినిచ్చే అమ్మమ్మల కాలం నాటి ఈ టేస్టీ రెసిపీని ఇంట్లోనే సింపుల్‌గా ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

రాగి పిండి: 3 కప్పులు

బెల్లం తురుము: ఒకటిన్నర కప్పు

ఎండు కొబ్బరి ముక్కలు: తగినన్ని

యాలకులు: 4 నుంచి 5

నెయ్యి: తగినంత

డ్రై ఫ్రూట్స్: జీడిపప్పు, బాదం ముక్కలు

నీళ్లు: తగినన్ని

తయారీ విధానం ఇదే..
ముందుగా మూడు కప్పుల రాగి పిండిని జల్లెడ పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనికి ఒకటిన్నర కప్పు బెల్లం తురుమును కలిపి, మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లం పిండిలో బాగా కలిసిపోతుంది. తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు, యాలకులను కలిపి మిక్సీలో మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ కొబ్బరి పొడిని ముందుగా సిద్ధం చేసుకున్న రాగి-బెల్లం మిశ్రమంలో కలపాలి. అనంతరం స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి, అందులో జీడిపప్పు, బాదం ముక్కలను దోరగా వేయించుకోవాలి. వీటిని రాగి పిండి మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, పిండిని గట్టి ముద్దలా కలుపుకోవాలి.

తర్వాత చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని కుడుముల్లా ఒత్తుకోవాలి. అనంతరం ఇడ్లీ పాత్రలకు నెయ్యి రాసి, సిద్ధం చేసుకున్న కుడుములను అందులో ఉంచాలి. స్టవ్ మీద మీడియం ఫ్లేమ్‌లో సుమారు 20 నుంచి 25 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. ఆవిరి తగ్గిన తర్వాత పాత్ర నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే సింపుల్ మీ రాగి బెల్లం కుడుములు సిద్ధం అయిపోయాయి. ఈ రాగి కుడుములు కేవలం రుచికరమే కాదు, నిల్వ కూడా ఉంటాయి. ఇవి బయట ఉంటే 2 రోజులు, ఫ్రిజ్‌లో పెడితే 4 నుంచి 5 రోజుల వరకు తాజాగా ఉంటాయి. పిల్లలకు స్నాక్స్‌లా లేదా పండగ సమయాల్లో నైవేద్యంగా పెట్టడానికి ఇది ఒక అద్భుతమైన వంటకంగా పని చేస్తుంది.

ప్రయోజనాలు ఇవే..
రాగి పిండి తీపి కుడుములు రుచికరమైన వంటకం మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన పోషకాలను అందించే అద్భుతమైన పోషకాహారం. ఇందులో ప్రధానంగా ఉపయోగించే రాగి, బెల్లం, కొబ్బరి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాగిలో కాల్షియం ఎక్కువ శాతం ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చడానికి, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా చూడటానికి సహాయపడుతుంది. పెరుగుతున్న పిల్లలకు, వృద్ధులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ కుడుముల్లో చక్కెర బదులు బెల్లాన్ని ఉపయోగిస్తాం. రాగి – బెల్లం రెండింటిలోనూ ఐరన్ (ఇనుము) పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.

రాగిలో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇవి తిన్న తర్వాత కడుపు నిండుగా అనిపించి, ఎక్కువ సేపు ఆకలి వేయదు. అనవసరమైన చిరుతిళ్లు తినకుండా నియంత్రిస్తుంది, దీంతో బరువు తగ్గడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. మిగిలిన ధాన్యాలతో పోలిస్తే రాగిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బెల్లం ఉపయోగించడం వల్ల ఇన్సులిన్ స్పైక్స్ తక్కువగా ఉంటాయి (పరిమితంగా తీసుకున్నప్పుడు). రాగిలో ఉండే అమైనో యాసిడ్స్ కాలేయంలోని అదనపు కొవ్వును తొలగిస్తాయి. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి.

ఇది గ్లూటెన్ లేని ఆహారం. అంతేకాకుండా ఆవిరిపై ఉడికించడం వల్ల దీనిలోని పోషకాలు నశించవు. సులభంగా జీర్ణమవుతుంది కాబట్టి జీర్ణసంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు. రాగిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతాయి. ఇందులోని అమైనో యాసిడ్స్ సహజమైన ఉపశమనకారిగా పనిచేసి మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి. మైదా, పంచదారతో చేసే నూనె పదార్థాల కంటే, ఇలాంటి ఆవిరి కుడుములను వారానికి కనీసం రెండు సార్లు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. ఇలా ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలిగి ఉన్న ఈ వంటకాన్ని మీరు కూడా మీకు కుదిరినప్పుడు ఇంట్లో ప్రయత్నించి చూడండి.