Heatwave : ఉదయం 9గంటలకే రోడ్లు మండిపోతున్నాయి. మధ్యాహ్నానికి చెట్ల నీడ కూడా వేడి ఊపిరి తీస్తోంది. సాయంత్రం అయినా ఉపశమనం లేదు. దేశంలోని అనేక నగరాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీల వరకు చేరుకుంటుండటంతో ఈ వేసవి సాధారణ సీజన్లా కాదు.. శరీరంపై దాడి చేస్తున్న ఆరోగ్య సంక్షోభంగా మారుతోంది. చెమటతో శరీరం నీరసించిపోవడం, అలసట, చిరాకు, నిద్రలేమి, గుండెపై ఒత్తిడి, చర్మ సమస్యలు లాంటివి ఇప్పుడు వేసవి భాగమే అయిపోయాయి. కేవలం ఎసీ ఆన్ చేయడం, ఎక్కువ నీళ్లు తాగడం సరిపోదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ మండే ఎండలో బతకడం కోసం శరీరాన్ని లోపల నుంచి బయట వరకు సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.
డాక్టర్ల ప్రకారం తీవ్రమైన ఎండల్లో శరీరం చెమట ద్వారా కేవలం నీటినే కాదు.. కీలకమైన ఎలక్ట్రోలైట్స్ను కూడా కోల్పోతుంది. ఇవే శరీరంలో నీటి సమతౌల్యాన్ని కాపాడతాయి. అందుకే వేసవిలో కేవలం నీళ్లు మాత్రమే తాగడం చాలదని ఆయన చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు, చిటికెడు ఉప్పు కలిపిన నిమ్మరసం, మజ్జిగ వంటి పానీయాలు శరీరానికి ఉపశమనం ఇస్తాయని సూచిస్తున్నారు. ఒక్కసారిగా లీటర్ల కొద్దీ నీరు తాగడం కంటే కొద్దికొద్దిగా తరచూ తాగడం మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా మూత్రం ముదురు పసుపు రంగులో కనిపిస్తే అది డీహైడ్రేషన్కు సంకేతమని హెచ్చరిస్తున్నారు.
వేసవిలో జీర్ణవ్యవస్థ కూడా ఒత్తిడికి గురవుతుంది. మసాలా, నూనె ఎక్కువగా ఉన్న ఆహారం శరీరంలో వేడిని మరింత పెంచుతుంది. అందుకే పుచ్చకాయ, బత్తాయి, బొప్పాయి, కర్బూజ వంటి నీరు అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పెరుగు అన్నం, దోసకాయ, సొరకాయ వంటి తేలికపాటి ఆహారం జీర్ణక్రియకు మేలు చేస్తుందని చెబుతున్నారు. భారీ భోజనాల కంటే చిన్న చిన్న మోతాదుల్లో తరచూ తినడం శరీరానికి తక్కువ భారం అవుతుంది.
ఈ ఎండ చర్మాన్ని కూడా వదిలిపెట్టదు. టాన్, దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు ఎక్కువవుతాయి. అందుకే ఇంట్లో ఉన్నా సన్స్క్రీన్ వాడాలని, కాటన్ దుస్తులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. చల్లటి నీటితో స్నానం చేయడం ఉపశమనం ఇస్తుంది కానీ మరీ ఐస్ కోల్డ్ వాటర్ ఉపయోగించడం మంచిది కాదని చెబుతున్నారు. చెమట ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో చర్మవ్యాధులు వేగంగా వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
అత్యధిక వేడి గుండెపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా బీపీ, షుగర్, గుండె జబ్బులు ఉన్నవారు మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. తల తిరగడం, గుండె దడ, తీవ్ర అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే హీట్ ఎగ్జాస్షన్ నిశ్శబ్దంగా హీట్ స్ట్రోక్గా మారే ప్రమాదం ఉంటుంది. అది ప్రాణాంతక పరిస్థితి.
ఇక ఎసీ వాడకం కూడా ఇప్పుడు మరో చర్చగా మారింది. నిరంతరం చల్లటి గదుల్లో ఉండడం వల్ల చర్మం పొడిబారడం, తలనొప్పులు, శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎసీని 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచడం మంచిదని సూచిస్తున్నారు. బయట తీవ్రమైన ఎండ నుంచి ఒక్కసారిగా ఫ్రీజింగ్ ఎసీ గదిలోకి వెళ్లడం శరీరంపై షాక్లా పనిచేస్తుందని హెచ్చరిస్తున్నారు.
వేసవిలో నిద్ర కూడా పెద్ద సమస్యగా మారుతోంది. వేడి కారణంగా సరైన నిద్ర లేకపోతే చిరాకు, ఆందోళన, మానసిక అలసట పెరుగుతాయి. పడుకునే ముందు ఫోన్లు, స్క్రీన్లను దూరంగా పెట్టడం, గాలి సరిగా వచ్చే గదిలో నిద్రించడం, రాత్రి ఆలస్యంగా భోజనం చేయకపోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. తేలికపాటి ధ్యానం, నెమ్మదిగా శ్వాస తీసుకోవడం వంటి అలవాట్లు కూడా శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతాయని సూచిస్తున్నారు.
పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, బయట పని చేసే కార్మికులు మాత్రం ఈ ఎండలో అత్యంత ప్రమాదంలో ఉంటారు. నోరు ఎండిపోవడం, మూత్రం తగ్గిపోవడం, నీరసం, గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలను, పెంపుడు జంతువులను కార్లలో ఒంటరిగా వదిలేయడం ప్రాణాంతకమవుతుందని చెబుతున్నారు. ఏది ఏమైనా దోబూచులాడుతున్న నైరుతి ఋతుపవనాలు అడుగు పెట్టేంత వరకు మరికొన్ని రోజులు జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం.
