Ebola : ఒకప్పుడు ఆఫ్రికా అడవుల్లో మాత్రమే వినిపించిన ఎబోలా అనే పేరు… ఇప్పుడు మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా తర్వాత ప్రపంచం కొంచెం ఊపిరి పీల్చుకుంటుందనుకునేలోపే మరో వైరస్ భయం యూరప్ తలుపు తట్టింది. ఇటలీలోని మిలాన్ నగరంలో రెండు ఎబోలా అనుమానిత కేసులు బయటపడటంతో యూరప్ ఆరోగ్య వ్యవస్థ మళ్లీ అప్రమత్తమైంది. ఉగాండాలో మూడు నెలలు సేవలు అందించి తిరిగి వచ్చిన ఇద్దరు సహాయక సిబ్బందికి జ్వరం, వాంతులు, విరేచనాలు, బలహీనత వంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే మిలాన్లోని ప్రత్యేక అంటువ్యాధుల ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి నమూనాలను పరీక్షిస్తున్న ఇటలీ వైద్య అధికారులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నప్పటికీ.. ఎబోలా అనే ఒక్క పదమే ప్రపంచవ్యాప్తంగా భయాన్ని రేకెత్తిస్తోంది.
ఈ పరిణామం మరింత ఆందోళన కలిగించడానికి కారణం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఉగాండా, కాంగో ప్రాంతాల్లో వ్యాపిస్తున్న బుండిబుగ్యో స్ట్రెయిన్ ఎబోలాను అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించడం. ఇది సాధారణ ఎబోలా వైరస్లా కాకుండా అరుదుగా కనిపించే రకం. ఇప్పటివరకు దీనికి అధికారికంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్ లేదు. ప్రత్యేక యాంటీవైరల్ చికిత్స కూడా అందుబాటులో లేదు. మధ్య ఆఫ్రికాలో ఇప్పటికే వందల సంఖ్యలో అనుమానిత కేసులు నమోదవగా, పదుల సంఖ్యలో మరణాలు సంభవించినట్టు WHO నివేదికలు చెబుతున్నాయి. యుద్ధ పరిస్థితులు, ప్రజల వలసలు, బలహీన ఆరోగ్య వ్యవస్థలు వైరస్ నియంత్రణను మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి.
ఎబోలా వైరస్ కరోనా లాగా గాలిలో వ్యాపించదు. ఇది ప్రధానంగా రక్తం, చెమట, లాలాజలం, వాంతులు, మూత్రం వంటి శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తి ఉపయోగించిన వస్తువులు, కలుషిత ఉపరితలాలు కూడా ప్రమాదకరంగా మారవచ్చు. అయితే లక్షణాలు బయటపడిన తర్వాతే వ్యక్తి నుంచి వైరస్ వ్యాపించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జ్వరం, తీవ్రమైన అలసట, విరేచనాలు, వాంతులు, శరీరంలో అనూహ్య రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందే.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఉగాండా, కాంగో వంటి ప్రభావిత ప్రాంతాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. తరచూ చేతులు కడుక్కోవడం, శానిటైజర్లు ఉపయోగించడం, అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండడం అత్యంత ముఖ్యమని చెబుతున్నాయి. ముఖ్యంగా అడవి జంతువుల మాంసం తినడం, చనిపోయిన జంతువులను తాకడం ప్రమాదకరమని స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే ఎబోలా వ్యాప్తి ఎక్కువగా గబ్బిలాలు, కోతులు వంటి అడవి జంతువుల నుంచే ప్రారంభమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఇటలీ ఇప్పటికే విమానాశ్రయాల్లో పర్యవేక్షణను కట్టుదిట్టం చేసింది. మిలాన్ మల్పెన్సా, రోమ్ ఫియుమిచినో విమానాశ్రయాల్లో ఉగాండా, కాంగో నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉష్ణోగ్రత పరీక్షలు, ఆరోగ్య ప్రశ్నాపత్రాలు, అదనపు వైద్య పరిశీలనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కేసులు నిర్ధారణ కాలేదు గానీ.. ఒక వైరస్ ప్రపంచాన్ని చేరడానికి సరిహద్దులు అడ్డుకాదనే వాస్తవాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. కరోనా కాలం మనకు ఒక పాఠం నేర్పింది. వైరస్ల కంటే వేగంగా వ్యాపించేది అపోహలు. అందుకే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మకుండా WHO, ప్రభుత్వ ఆరోగ్య శాఖలు, అధికారిక సంస్థల సమాచారాన్నే విశ్వసించాలని నిపుణులు చెబుతున్నారు.
