Site icon NTV Telugu

Saggubiyyam Payasam: పంచదార అక్కర్లేదు.. ఎండలకి చలవ చేసే ‘హెల్దీ’ పాయసం ఇలా సింపుల్‌గా చేసుకోండి!

Healthy Sago Payasam

Healthy Sago Payasam

Saggubiyyam Payasam: వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలంటే శరీరానికి చలువ చేసే పదార్థాలు తీసుకోవాలి. అలాంటి వాటిలో మొదటి వరుసలో ఉంటుంది సగ్గుబియ్యం. అయితే, పాయసంలో పంచదార వేస్తే క్యాలరీలు పెరుగుతాయనే భయం ఉందా? అందుకే పంచదారకు బదులు బెల్లంతో, చిక్కని పాలతో నోరూరించే ‘సగ్గుబియ్యం బెల్లం పాయసం’ ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం. ఇది తింటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం ఎలా వస్తుందో చదివేయండి.

READ ALSO: HAWALA MONEY: కారంపొడి చల్లి.. కత్తులతో బెదిరించి.. రూ. కోటితో జంప్

బెల్లం సగ్గుబియ్యం పాయసానికి కావాల్సిన పదార్థాలు..

సగ్గుబియ్యం – 1 కప్పు

బెల్లం తురుము – 1.25 నుంచి 1.5 కప్పులు

పాలు – 4 కప్పులు (గోరువెచ్చనివి)

నెయ్యి – 1 టేబుల్ స్పూన్

డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం, కిస్మిస్, ఎండు కొబ్బరి)

యాలకుల పొడి – పావు టీస్పూన్

పచ్చ కర్పూరం – చిటికెడు (ఆప్షనల్)

తయారీ విధానం:
ముందుగా సగ్గుబియ్యాన్ని కడిగి, ఒక కప్పు నీరు పోసి 2-3 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత ఒక కడాయిలో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 3 కప్పుల నీళ్లు పోసి మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం వేసి 10 నిమిషాల పాటు మెత్తగా ఉడికించాలి. తర్వాత సగ్గుబియ్యం ఉడికాక బెల్లం తురుము వేసి పూర్తిగా కరిగే వరకు మరిగించాలి. కలపడం పూర్తి అయిన తర్వాత స్టవ్ ఆపి, పాయసాన్ని ఒక నిమిషం పాటు చల్లారనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని పాలు పోసి కలపాలి. వెంటనే పాలు పోస్తే విరిగిపోయే ప్రమాదం ఉంది. చివరగా వేయించిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేస్తే రుచికరమైన సగ్గుబియ్యం పాయసం రెడీ..

ప్రయోజనాలు ఇవే..
సగ్గుబియ్యం మరియు బెల్లం కలయికతో చేసే ఈ పాయసం కేవలం రుచిని మాత్రమే కాకుండా, శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు. అవి ఏంటంటే.. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు లేదా ఉపవాసాల సమయంలో ఈ పాయసం తీసుకోవడం వల్ల శక్తి లభిస్తుంది. సగ్గుబియ్యానికి శరీర ఉష్ణోగ్రతను తగ్గించే గుణం ఉంది. ఎండల వల్ల వచ్చే అధిక వేడిని తగ్గించి, శరీరాన్ని లోపల నుండి చల్లబరచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే వేసవిలో ఇది బెస్ట్ హెల్దీ డెజర్ట్‌గా నిపుణులు సూచిస్తున్నారు. సగ్గుబియ్యం చాలా తేలికగా జీర్ణమవుతుంది. ఇది గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు ఎవరైనా దీనిని సులభంగా తినవచ్చు. మనం ఇందులో పంచదారకు బదులు బెల్లం వాడుతున్నాం. బెల్లంలో ఐరన్ (ఇనుము) శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, రక్తహీనత (Anemia) రాకుండా కాపాడుతుంది. సగ్గుబియ్యంలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ K ఉంటాయి. ఇవి ఎముకలు దృఢంగా ఉండటానికి తోడ్పడతాయి. సగ్గుబియ్యంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి, రక్తపోటును (BP) అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఈ పాయసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ప్రసాదంగా సమర్పించుకోవడానికైనా లేదా ఇంట్లో పిల్లలకు స్వీట్ తినిపించాలన్నా బెస్ట్ ఆప్షన్స్‌గా పని చేస్తుంది. ఈ వేసవిలో మీకు టైం ఉన్నప్పుడు ఈ హెల్దీ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.

READ ALSO: SS Thaman: నాకు కాపీ కొట్టడం రాదు.. అందుకే దొరికిపోతా: థమన్

Exit mobile version