రష్యాతో శాంతి ఒప్పందం 10 శాతం దూరంగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. నూతన సంవత్సర వేడుకల ప్రసంగంలో జెలెన్స్కీ మాట్లాడారు. దేశం యుద్ధానికి ముగింపు పలకాలని కోరుకుంటోందని తెలిపారు. ఒక బలమైన భద్రతా హామీతో ఒప్పందం అవసరం అని పేర్కొన్నారు. డబ్బు కోసం కాదని.. రష్యా తిరిగి దాడి చేయకుండా నిరోధించే ఏ ఒప్పందానికైనా సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: LPG Price Hike: కొత్త ఏడాది వేళ బిగ్షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు
మిగిలిన 10 శాతంలో అతి ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. మాస్కోకు ఎటువంటి సహాయ సహకారాలు అందించకూడదని హెచ్చరించారు. ఉక్రెయిన్లో దాదాపు 20 శాతం రష్యా ఆక్రమించుకుందని.. ఇక ఒప్పందంలో భాగంగా తూర్పు డాన్బాస్ ప్రాంతం కావాలని మాస్కో ఒత్తిడి చేస్తోందని తెలిపారు. అయితే ఆ భూమిని వదులుకోవాలని దౌత్యవేత్తలు ఒత్తిడి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అది వదులుకునే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతం 90 శాతం శాంతి ఒప్పందం పూర్తైందని… మిగతా 10 శాతం ఉక్రెయిన్ భవిష్యత్ను, యూరప్ భవిష్యత్ను నిర్ణయిస్తుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Earthquake: జపాన్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్పై 6 తీవ్రత నమోదు
గత నాలుగేళ్ల నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సాగుతోంది. తాజాగా ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అయితే ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇరు దేశాధినేతలతో సమావేశం అయ్యారు. కానీ సత్ఫలితాన్ని ఇవ్వలేదు. తాజాగా మరోసారి 28 పాయింట్ల ప్రణాళికతో ముందుకు వచ్చారు. దీనికి రష్యా అంగీకారం తెలిపితే.. ఉక్రెయిన్ తిరస్కరించింది. ప్రస్తుతం అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు చర్చలు నడుపుతున్నారు. త్వరలోనే శాంతి ఒప్పందం జరగొచ్చని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. ఏం జరుగుతుందో చూడాలి. నూతన సంవత్సరంలోనైనా శుభవార్త వింటామో లేదో చూడాలి.
