XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్‌.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?

  • చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తీవ్ర ఆరోగ్య సమస్య..
  • వైద్య చికిత్స పొందుతున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు..
  • బ్రిక్స్ సదస్సులో అనారోగ్యంతో ఉన్నారని నివేదికలు..
  • ఇంకా అధికారికంగా ధ్రువీకరించని చైనా..
Xi Jinping

Xi Jinping

XI Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఇటీవల, బ్రిక్స్ సదస్సు కోసం భారత్ వచ్చిన ఆయన, తిరిగి చైనా వెళ్లిన వెంటనే ఆస్పత్రిలో చేరినట్లు వార్తా కథనాలు నివేదించాయి. అయితే, దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం జిన్‌పింగ్ ఆరోగ్యంపై ఊహాగానాలు తీవ్రమవుతున్నాయి.

బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఆయన స్పృహ కోల్పోయారని, దీని తర్వాత వైద్య సహాయం అందించారని, తీవ్ర ఇస్కీమిక్ స్ట్రోక్‌కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారని కొన్ని ఆన్‌లైన్ పోస్టులు నివేదించాయి. చైనా డెమోక్రసీ పార్టీ చైర్మన్ షీ వాంజున్ తన ఎక్స్ ఖాతాలో ఈ ఆరోపణలు చేసినట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఢిల్లీలో వైద్య చికిత్సకు నిరాకరించిన జిన్‌పింగ్, ప్రత్యేక విమానంలో బీజింగ్ చేరిన వెంటనే ఆస్పత్రిలో చేరినట్లు చెబుతున్నారు.

సాధారణంగా విదేశీ పర్యటన ముగించుకువచ్చిన తర్వాత జిన్‌పింగ్‌కు ఎయిర్‌పోర్టులోనే భారీ స్వాగతం పలిచేందుకు పెద్ద సంఖ్యలో అధికారులు ఉంటారని, కానీ ఈ సారి ఆ సందడి లేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నట్లు నివేదికలు సూచించాయి. జిన్‌పింగ్‌ను అత్యంత రహస్యంగా ఉండే ఆస్పత్రికి హెలికాప్టర్‌లో తరలించారని, ఆయన పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు వస్తున్నాయి.

దీనికి ముందు బ్రిక్స్ సమావేశంలో కూడా కొన్ని సంఘటనలు ఆయన ఆరోగ్యంపై అనుమానాలను రేకెత్తించాయి. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ.. జిన్‌పింగ్‌ను గమనిస్తూ కొన్ని క్షణాలు ఆయన ప్రసంగాన్ని ఆపారు. ఆ తర్వాత భారత్ బ్రిక్స్ అతిథులకు ఇచ్చిన డిన్నర్‌లో జిన్‌పింగ్ పాల్గొనకపోవడం కూడా సందేహాలను పెంచింది. ఇదే కాకుండా విమానం మెట్లు ఎక్కుతున్న సమయంలో ఆయన చాలా బలహీనంగా కనిపించారని, ఆయన నడకలో సమతుల్యత లేదని చెబుతున్నారు.