White House: లాక్‌డౌన్‌లో వైట్ హౌస్.. అమెరికా అధ్యక్షుడి నివాసం వద్ద గన్ ఫైర్.. రంగంలోకి సీక్రెట్ సర్వీస్!

White House Shooting

White House Shooting

White House: అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్ హౌస్’ సమీపంలో సోమవారం సాయంత్రం కాల్పులు జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. 15వ వీధి – ఇండిపెండెన్స్ అవెన్యూ కూడలిలో, వాషింగ్టన్ మాన్యుమెంట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన యూఎస్ సీక్రెట్ సర్వీస్ దళాలు వైట్ హౌస్ సముదాయాన్ని దిగ్బంధించాయి. అసలు ఏం జరిగిందంటే.. సీక్రెట్ సర్వీస్ కథనం ప్రకారం.. సోమవారం సాయంత్రం 4:10 గంటల సమయంలో సాయుధ వ్యక్తి ఒకరు అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో భద్రతా దళాలు అతడిని అడ్డుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో సదరు వ్యక్తి గాయపడ్డాడు. నిందితుడిని ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వైట్ హౌస్ సిబ్బందికి గానీ, ఇతరులకు గానీ ఎటువంటి గాయాలు కాలేదు.

బ్రీఫింగ్ రూమ్‌లోకి జర్నలిస్టుల తరలింపు..
కాల్పుల శబ్దం వినబడగానే వైట్ హౌస్ అంతటా ‘హై అలర్ట్’ ప్రకటించారు. ఆ సమయంలో నార్త్ లాన్‌లో ఉన్న జర్నలిస్టులను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వేగంగా లోపలికి తరలించి, ప్రెస్ బ్రీఫింగ్ రూమ్‌లో ఉంచారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుమారు 15 నిమిషాల పాటు వైట్ హౌస్ లాక్‌డౌన్‌లో ఉంది. భద్రతా బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చిన తర్వాత లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. అనంతరం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ఈస్ట్ రూమ్‌లో ఏర్పాటు చేసిన చిన్న వ్యాపార యజమానుల సమావేశంలో పాల్గొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమం 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. “నేషనల్ గార్డ్‌ను మోహరించడం వంటి కఠిన చర్యల వల్ల వాషింగ్టన్ ఇప్పుడు అమెరికాలోనే అత్యంత సురక్షితమైన నగరంగా మారింది” అని ధీమా వ్యక్తం చేశారు.

కొనసాగుతున్న హై అలర్ట్
గత ఏప్రిల్ 24న వైట్ హౌస్ కరస్పాండెంట్స్ విందులో కోల్ అలెన్ అనే వ్యక్తి ట్రంప్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన తర్వాత వాషింగ్టన్‌లో భద్రతను పతాక స్థాయికి పెంచారు. తాజా కాల్పుల నేపథ్యంలో ఇండిపెండెన్స్ అవెన్యూ వైపు వెళ్లే రహదారులను మూసివేశారు. మెట్రోపాలిటన్ పోలీసులు, సీక్రెట్ సర్వీస్ సంయుక్తంగా ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. వాషింగ్టన్ మౌన్యుమెంట్, వైట్ హౌస్ సందర్శనార్థం వచ్చే పర్యాటకులు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.