ప్రధాని మోడీ ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం శనివారం ఉజ్బెకిస్థాన్ వెళ్లారు. పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఇక భారతీయులకు ఉజ్బెకిస్థాన్ కీలక గుడ్న్యూస్ చెప్పింది. భారత పౌరులకు 30 రోజుల పాటు వీసా లేకుండానే దేశంలోకి ప్రవేశించే అవకాశం కల్పించింది. ప్రధాని మోడీ ఉజ్బెకిస్థాన్ పర్యటన సందర్భంగా ఈ నిర్ణయం వెలువడింది. ఈ చర్యతో పర్యాటకం, వ్యాపార సంబంధాలు, ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ తెలిపారు.
ఆదివారం తాష్కెంట్లో ప్రధాని మోడీ, అధ్యక్షుడు మిర్జియోయెవ్ మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచాలని నిర్ణయించారు. అలాగే 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026లో భారత్-ఉజ్బెకిస్థాన్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 15 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. ఇరు దేశాల సంబంధాలకు మరింత విస్తృతమైన, ప్రతిష్టాత్మకమైన రూపాన్ని కల్పిస్తున్నామని మోడీ తెలిపారు.
గత ఏడాది భారత్-ఉజ్బెకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం తొలిసారిగా 1 బిలియన్ డాలర్ల మార్క్ను దాటిందని మిర్జియోయెవ్ తెలిపారు. ఇరు దేశాల మధ్య జాయింట్ వెంచర్ల సంఖ్య కూడా ఇటీవలి సంవత్సరాల్లో ఏకంగా ఏడు రెట్లు పెరిగిందని చెప్పారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కీలక ఖనిజాలు, క్లీన్ ఎనర్జీ, అంతరిక్షం, అణు ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.
భారత్-ఉజ్బెకిస్థాన్ చర్చల్లో అణు ఇంధన రంగం కూడా కీలకంగా నిలిచింది. ఉజ్బెకిస్థాన్ నుంచి భారత్కు దీర్ఘకాలికంగా యురేనియం సరఫరా చేసే ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు మోడీ ప్రకటించారు. భారత్లో అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాల్లో ఇది ప్రాధాన్యం సంతరించుకోనుంది. రక్షణ, భద్రతా సహకారంపైనా ఇరు దేశాల నేతలు చర్చించారు. రక్షణ రంగాల్లో ప్రత్యక్ష అనుసంధానాలు, ఉమ్మడి ఉత్పత్తి, సంయుక్త అభివృద్ధిని ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం ప్రాంతానికి తీవ్రమైన సవాళ్లని.. వీటిని ఎదుర్కోవడంలో భారత్, ఉజ్బెకిస్థాన్ కలిసి పనిచేయాలని మోడీ అన్నారు. ఇంధనం, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, ఆభరణాలు, సంస్కృతి వంటి రంగాల్లోనూ సహకారాన్ని పెంచాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించనున్నారు.
14 డైరెక్ట్ విమానాలు
భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య ప్రస్తుతం వారానికి 14 నేరుగా విమాన సర్వీసులు నడుస్తున్నాయని మిర్జియోయెవ్ తెలిపారు. కొత్త వీసా రహిత విధానంతో పర్యాటకులు, వ్యాపార ప్రయాణికుల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఉజ్బెకిస్థాన్లో యోగా కూడా వేగంగా ప్రజాదరణ పొందుతోందని చెప్పారు. 2018 నుంచి ఆ దేశంలో ప్రత్యేక యోగా ఫెడరేషన్ పనిచేస్తోంది. జూన్లో దేశవ్యాప్తంగా యోగా ఫెస్టివల్ను కూడా నిర్వహించారు. మోడీ తన పర్యటనలో భాగంగా తాష్కెంట్లో ఉజ్బెక్ యోగా సాధకులు పాల్గొన్న కార్యక్రమాన్ని వీక్షించారు.
మూడు సిస్టర్ సిటీ, స్టేట్ ఒప్పందాలు
దేశాల మధ్య సంబంధాలను స్థానిక స్థాయిలోనూ విస్తరించేందుకు మూడు సిస్టర్ సిటీ, సిస్టర్ స్టేట్ ఒప్పందాలు చేసుకోవాలని భారత్, ఉజ్బెకిస్థాన్ నిర్ణయించాయి. ఉజ్బెకిస్థాన్ నిర్మిస్తున్న న్యూ తాష్కెంట్ ప్రాజెక్టు, గుజరాత్లోని భారత గిఫ్ట్ సిటీ మధ్య సహకారానికి అవకాశాలున్నాయని మోడీ తెలిపారు. గిఫ్ట్ సిటీ అభివృద్ధిలో ఉపయోగించిన సాంకేతికత, ప్రణాళికలు, ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు ఉజ్బెక్ ప్రతినిధి బృందాన్ని భారత్కు ఆహ్వానించారు.
మోడీకి అత్యున్నత పురస్కారం
మోడీ ఉజ్బెకిస్థాన్ పర్యటన సందర్భంగా అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఆయనకు ఆ దేశ అత్యున్నత ప్రభుత్వ పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ఒలీ దరజాలి దుస్త్లిక్’ను ప్రదానం చేశారు. ఈ గౌరవం భారత్-ఉజ్బెకిస్థాన్ మధ్య కొనసాగుతున్న స్నేహానికి ప్రతీకగా మోడీ అభివర్ణించారు. ఈ పురస్కారాన్ని భారత ప్రజలకు, ఇరు దేశాల ఉమ్మడి వారసత్వానికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. భారత్, ఉజ్బెకిస్థాన్ 1992లో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నాయి. 2011లో ఇరు దేశాల సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరాయి. మోడీ తాజా పర్యటన ఉజ్బెకిస్థాన్కు ఆయన నాలుగో పర్యటన.
తదుపరి కిర్గిజిస్థాన్కు మోడీ
ఉజ్బెకిస్థాన్ పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్కు వెళ్లనున్నారు. అక్కడ ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరిగే 26వ షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో పాల్గొంటారు. SCO ఏర్పాటై 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సదస్సు జరుగుతోంది. సదస్సులో భారత్ భద్రత, కనెక్టివిటీ, అవకాశాలకు సంబంధించిన తన ప్రాధాన్యతలను ప్రస్తావించడంతో పాటు.. ఇతర దేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనుంది.

