US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్

  • ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
  • రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు
  • అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు
Us

Us

ఇరాన్‌పై కఠిన ఆంక్షలు విధించేందుకు అమెరికా రంగం సిద్ధం చేస్తుందా? హార్ముజ్ జలసంధి నిరూపయోగంగా మారనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజా పరిణామాలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు పెట్టేందుకు అమెరికా ప్రణాళిక రచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

హార్ముజ్ జలసంధిని మరో మార్గాల ద్వారా దాటే అవకాశం రెండేళ్లలో ఏర్పడవచ్చని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అన్నారు. అదే జరిగితే వ్యూహాత్మకంగా కీలకమైన ఈ జలమార్గం ‘విలువలేనిదిగా’ మారే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతున్న నేపథ్యంలో బెసెంట్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అమెరికా ట్రెజరీ విభాగం ఇరాన్‌కు అనుబంధంగా ఉన్న విమానాల లీజింగ్ సంస్థలపై కూడా దృష్టి సారిస్తోందని బెసెంట్ తెలిపారు. ఈ వారంలో ఓ బ్యాంకుపై, వచ్చే వారం మరో బ్యాంకుపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని వెల్లడించారు. ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు ప్రతి వారం కొత్తగా సెకండరీ ఆంక్షలు విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

చైనాతోనూ అమెరికా చర్చలు

ఇరాన్‌కు సంబంధించి చైనాతో అమెరికా ప్రైవేట్‌గా చర్చలు జరిపినట్లు బెసెంట్ తెలిపారు. ఇరాన్ చమురును కొనుగోలు చేసే ప్రధాన దేశాల్లో చైనా ఒకటి కావడంతో.. అమెరికా ఆంక్షల వ్యూహంలో బీజింగ్ కీలకంగా మారింది. ఇరాన్‌తో చైనాకు ఉన్న ఆర్థిక సంబంధాలపై కూడా అమెరికా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇరాన్‌తో ఆర్థిక సంబంధాలున్న సంస్థలను డాలర్ ఆధారిత అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి పూర్తిగా దూరం చేసే చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని బెసెంట్ సంకేతాలిచ్చారు. ఇటీవల ఇరాన్‌తో ఆర్థిక సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ఈజిప్ట్‌కు చెందిన Banque Misrకు చెందిన యూఏఈ శాఖలపై అమెరికా ఆంక్షలు విధించింది.

హార్ముజ్‌లో ఉద్రిక్తత

హార్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటి. అయితే అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై యుద్ధ చర్యలు ప్రారంభించిన తర్వాత ఈ జలసంధిలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. జలసంధి మీదుగా ప్రయాణించే నౌకల నుంచి రుసుములు వసూలు చేయాలని ఇరాన్ భావిస్తోందని, తమకు అనుకూలమైన మార్గాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న నౌకలపై దాడులు కూడా చేసిందని సమాచారం. దీనికి ప్రతిస్పందనగా అమెరికా కూడా ఇరాన్ నౌకాశ్రయాలపై ప్రత్యామ్నాయ దిగ్బంధాన్ని అమలు చేసింది. దీంతో హార్ముజ్ మీదుగా నౌకల రాకపోకలు, ముఖ్యంగా ఇరాన్ చమురు ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది.

ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్న ట్రంప్

ఇటీవల వారాల పాటు ఇరాన్, అమెరికా మధ్య పరిస్థితులు కొంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ.. తాజాగా మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని కొనసాగిస్తామని బెసెంట్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివారం అమెరికా హార్ముజ్ జలసంధిలోని ఓ ఇరాన్ దీవిపై దాడులు చేపట్టినట్లు సమాచారం. దీనికి ప్రతిగా ఇరాన్ మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఇరు దేశాల మధ్య జరిగిన ఈ పరస్పర దాడులతో మరోసారి భారీ స్థాయిలో ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌పై సైనిక చర్యల కంటే ఆర్థిక ఒత్తిడిని పెంచడంపైనే ట్రంప్ ప్రభుత్వం ఇటీవల ఎక్కువగా దృష్టి సారించినప్పటికీ.. తాజా పరిణామాలు పరిస్థితిని మళ్లీ ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.