ఉత్తరప్రదేశ్లో భారీ ఉగ్ర కుట్రను యూపీ ఏటీఎస్ భగ్నం చేసింది. రైల్వేట్రాక్లు, షోరూమ్లు లక్ష్యంగా ఉత్తరప్రదేశ్లో భారీగా కుట్రకు ప్రణాళిక రచించిన ముఠాను ఏటీఎస్ సంస్థ వలపన్ని పట్టుకుంది. నలుగురు అనుమానితులను అరెస్ట్ చేసింది. మీరట్, నోయిడా నివాసులైన సాకిబ్ అలియాస్ డెవిల్, అరబాబ్, లోకేష్ పండిట్ అలియాస్ పాప్లా, వికాస్ గెహ్లావత్ అలియాస్ రౌనక్లను అరెస్టు చేశారు. వీళ్లంతా పాకిస్థాన్ ఐఎస్ఐ కనుసన్నల్లో నడుస్తున్నట్లుగా గుర్తించింది.
లక్నో, మీరట్తో సహా పలు నగరాల్లోని రైల్వే ట్రాక్ల వెంబడి ఉన్న కార్ షోరూమ్లు, గ్యాస్ సిలిండర్లతో నిండిన ట్రక్కులు, సిగ్నల్ బాక్సులను లక్ష్యంగా చేసుకుని పేల్చేసేందుకు ముఠా సన్నాహాలు చేస్తున్నట్లు ఆధారాలు సేకరించింది. నిప్పుపెట్టి, భయాందోళనలు సృష్టించడం వీరి లక్ష్యంగా తెలిపింది.
సాకిబ్ అలియాస్ డెవిల్ ద్వారా ముఖ్యమైన స్థావరాలపై నిఘా పెట్టినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. ఫొటోలు, వీడియోలు పంపే నెట్వర్క్లో లోకేష్ పండిట్ అలియాస్ పాప్లా, వికాస్ గెహ్లావత్ అలియాస్ రౌనక్ వంటి వారు పాలుపంచుకున్నారు. డబ్బు ఆశతో భారీ దాడికి ప్లాన్ చేసినట్లుగా కనిపెట్టింది.
మార్చి 4వ తేదీన బిజ్నోర్లో ఒక పికప్ వాహనానికి నిప్పంటించినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనకు సాకిబ్ అలియాస్ డెవిల్ ముఠానే పాల్పడినట్లుగా తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను టెలిగ్రామ్ ద్వారా పాకిస్థాన్లో ఉన్న ఒక ఐఎస్ఐ హ్యాండ్లర్కు పంపారు. పాకిస్థాన్లో ఉన్న ఐఎస్ఐ హ్యాండ్లర్, పలు ముఖ్యమైన కంటోన్మెంట్ ప్రాంతాలు, సైనిక కదలికలు, కీలకమైన స్థావరాల గూగుల్ లొకేషన్ల స్క్రీన్ రికార్డింగ్లను పంపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీని తర్వాత లక్ష్యంగా చేసుకున్న ప్రదేశాల రెక్కీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభ్యర్థించడం జరిగినట్లుగా కనిపెట్టింది.
బదులుగా ఐఎస్ఐ హ్యాండ్లర్.. సాకిబ్ అలియాస్ డెవిల్ పేర్కొన్న బ్యాంకు ఖాతాలకు క్యూఆర్ కోడ్ల ద్వారా డబ్బు పంపేవాడు. మొబైల్ ఫోన్ దర్యాప్తు సమయంలో యూపీ ఏటీఎస్ మీరట్, అలీగఢ్, ఘజియాబాద్లోని పలు కార్ షోరూమ్ల వీడియోలను కూడా కనుగొంది. లక్ష్యాలను ఛేదించడానికి ముందే ఈ వీడియోలను ఐఎస్ఐ హ్యాండ్లర్కు పంపేవారు. సాకిబ్ అలియాస్ డెవిల్ సోషల్ మీడియాలో ఆయుధాల రీళ్లను పోస్ట్ చేసినట్లు కూడా దర్యాప్తులో కనుగొన్నారు.
