Site icon NTV Telugu

UK-Russia: పశ్చిమాసియాలో మరో ఘర్షణ.. రష్యా నౌకలను స్వాధీనం చేసుకోవాలని యూకే ఆదేశం

Uk

Uk

వామ్మో.. పశ్చిమాసియా యుద్ధంతో ఇప్పటికే ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. యుద్ధ వార్తలు వింటేనే గుండె ఝళ్లుమంటోంది. ఇప్పటికే ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు ఘోరంగా దెబ్బతిన్నాయి. సామాన్యుల జీవితాలు కూడా గందరగోళంగా మారాయి. దీంతో యుద్ధానికి ముగింపు పలకాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో మరో రెండు దేశాల మధ్య ఘర్షణ మొదలయ్యేటట్టు కనిపిస్తోంది.

తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాన్ని చూసి పుతిన్ మురిసిపోతున్నారని.. చమురు ధరలు పెరిగితే తన జేబులు నింపుకోవచ్చని భావిస్తున్నారని మండిపడ్డారు. అది ఎప్పటికీ సాధ్యం కాదని… తాను స్వదేశంలోనూ.. విదేశాల్లోనూ బ్రిటిష్ ప్రయోజనాలను ఎల్లప్పుడూ కాపాడుతానని శపథం చేశారు. ఈ సందర్భంగా రష్యా రహస్య నౌకాదళంపై చర్య తీసుకుంటానని తీవ్రంగా హెచ్చరించారు.

రష్యాకు చెందిన ‘‘షాడో ఫ్లీ్ట్‌’’కు వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించారు. ప్రాశ్చాత్య ఆంక్షలను ధిక్కరించి చమురు విక్రయిస్తున్న రష్యా నౌకలను అడ్డగించి.. స్వాధీనం చేసుకోవాలని బ్రిటిష్ సైన్యానికి కీర్ స్టార్మర్ ఆదేశించారు. నౌకల ద్వారా వచ్చే అక్రమ సొమ్మును ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధానికి పుతిన్ వాడుతున్నారని.. తక్షణమే దీన్ని ఆపాలని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రష్యాకు చెందిన పాత, ప్రమాదకరమైన ట్యాంకర్లను స్వాధీనం చేసుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం సిద్ధమైంది.

మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నారని బ్రిటీష్ ప్రధాని కీర్ స్టార్మర్ తన సోషల్ మీడియాలో ఎక్స్‌లో రాసుకొచ్చారు. పెరుగుతున్న చమురు ధరలతో తన ఖజానా నింపుకోవడానికి సహాయపడుతున్నాయని పుతిన్ భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘‘పుతిన్ ఇప్పుడు ఆనందంతో చేతులు రుద్దుకుంటూ ఉండవచ్చు. కానీ మేము అతని రహస్య నౌకాదళంపై మరింత శక్తివంతంగా దాడి చేస్తాం. మా లక్ష్యం బ్రిటన్‌ను సురక్షితంగా ఉంచడం మాత్రమే కాదు.. ఉక్రెయిన్‌లో విధ్వంసం సృష్టిస్తున్న పుతిన్ యుద్ధ యంత్రాంగాన్ని కూడా ఆపుతాం’’ అని తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు.

షాడో ఫ్లీట్..
షాడో ఫ్లీట్ (Shadow Fleet) లేదా డార్క్ ఫ్లీట్ అంటే అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకోవడానికి.. అక్రమంగా లేదా రహస్యంగా చమురు వంటి వస్తువులను రవాణా చేసే పాత ఆయిల్ ట్యాంకర్ల సమూహం. ఈ నౌకలు తమ గుర్తింపు, యజమాని, గమ్యస్థానాన్ని దాచిపెడతాయి. రష్యా, ఇరాన్, వెనిజులా వంటి దేశాలు తమపై ఉన్న ఆంక్షల నుంచి బయటపడి చమురును విక్రయించడానికి వీటిని ప్రధానంగా ఉపయోగిస్తున్నాయి. ఈ నౌకలు సాధారణంగా 15 ఏళ్ల కంటే పాతవి. సరిగ్గా నిర్వహించబడనివి. సరైన బీమా (Insurance) లేనివి. ఇవి ప్రమాదానికి గురైతే భారీ చమురు లీకేజీలు సంభవించి పర్యావరణానికి.. ముఖ్యంగా సముద్రం వంటి ప్రాంతాల్లో పెద్ద ముప్పు వాటిల్లుతుంది.

ఇప్పుడు రష్యా కూడా ‘‘షాడో ఫ్లీట్’’ అని పిలువబడే పాత, గుర్తుపట్టలేని ట్యాంకర్ల పెద్ద నెట్‌‌వర్క్ నడిపిస్తోంది. పాశ్చాత్య ఆంక్షలను తప్పించుకోవడానికి రష్యా తన ముడి చమురులో సుమారు 75 శాతం ప్రపంచవ్యాప్తంగా ఈ నౌకలను ఉపయోగించి రవాణా చేస్తోంది. ఈ నౌకలు ఆర్థిక నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా.. పర్యావరణానికి గణనీయమైన ముప్పును కలిగిస్తాయి. ఈ ట్యాంకర్లు ఎంత అధ్వాన్న స్థితిలో ఉన్నాయంటే.. అవి ఏ క్షణంలోనైనా సముద్రంలోకి చమురును లీక్ చేసి సముద్ర జీవులకు ప్రమాదం కలిగించగలవు. అంతటి పాత ట్యాంకర్లు అవి. ఈ నేపథ్యంలోనే యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ ట్యాంకర్లను స్వాధీనం చేసుకుంటామని రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిణామం మరో యుద్ధానికి దారి తీస్తుందా? లేదంటే రాజీ పడతారా? అన్నది తేలాల్సి ఉంది.

ట్రంప్ నిర్ణయం ఆందోళన
మరోవైపు ట్రంప్ నిర్ణయం కూడా గందరగోళం సృష్టిస్తోంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా సముద్రంలో చిక్కుకున్న రష్యా చమురును కొనుగోలు చేసేందుకు కొన్ని దేశాలకు ట్రంప్ ప్రభుత్వం 30 రోజులు మినహాయింపు ఇచ్చింది. ఈ పరిణామం రష్యాపై ఒత్తిడి తెస్తున్న ఐరోపా దేశాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అయితే ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంతో ప్రపంచ మార్కెట్‌ను చక్కదిద్దడానికి సహాయపడుతుందని ట్రంప్ భావించారు. కానీ ఐరోపా దేశాలకు మాత్రం పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. అయితే ఇంగ్లీష్ ఛానల్ గుండా తరచుగా ప్రయాణించే 544 రష్యా నౌకలను ఇప్పటికే బ్రిటన్ నిషేధించింది. ఇక రష్యా రహస్య నౌకలను స్వాధీనం చేసుకోవడంలో బ్రిటన్‌తో చేతులు కలపాలని కీర్ స్టార్మర్ ఇతర దేశాలకు కూడా విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇతర దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

 

Exit mobile version