ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో యుద్ధం త్వరలోనే ముగిసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్తో దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. అమెరికాతో నేరుగా ఎలాంటి చర్చలు జరపడం లేదని స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధికి సంబంధించిన అంశాలపై పొరుగుదేశం ఒమన్తో మాత్రమే చర్చలు జరుగుతున్నాయని వెల్లడించింది.
వైట్హౌస్లోని ఓవల్ ఆఫీస్లో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్తో జరుగుతున్న పోరు త్వరలోనే ముగిసిపోతుందని అన్నారు. ‘‘ఇది చాలా త్వరలోనే ముగుస్తుందని భావిస్తున్నాను. వారు ఇంకా ఎక్కువ కాలం కొనసాగించలేరని అనుకుంటున్నాను’’ అని వ్యాఖ్యానించారు. ఇరాన్తో తమ ప్రభుత్వం చర్చలు జరుపుతోందని కూడా పేర్కొన్నారు. చర్చల పరిస్థితిపై అడిగిన ప్రశ్నకు ‘‘మనం బాగానే చేస్తున్నాం’’ అని సమాధానమిచ్చారు. అయితే ట్రంప్ వాదనను ఇరాన్ తిరస్కరించింది. అమెరికాతో నేరుగా చర్చలు జరపడం లేదని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లపై ఒమన్తో మాత్రమే చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.
కొద్ది రోజుల క్రితమే ఇరాన్పై భారీ స్థాయిలో సైనిక దాడి చేయాలన్న ప్రణాళికను ట్రంప్ రద్దు చేశారు. గత శనివారం అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఇరాన్, దాని ప్రాంతీయ భాగస్వాములు దాడిని నిలిపివేయాలని కోరినట్లు తనకు సమాచారం అందిందని, దౌత్యపరమైన పరిష్కారానికి అవకాశం కనిపించడంతో భారీ దాడిని రద్దు చేసినట్లు తెలిపారు. ఈ వారం ప్రారంభంలో మధ్యప్రాచ్యంలో మోహరించిన అమెరికా క్షిపణుల నిల్వలు తగ్గిపోతున్నాయంటూ వచ్చిన వార్తలపైనా ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అలాంటి వార్తలను తోసిపుచ్చారు.
మరోవైపు హార్ముజ్ జలసంధి భవిష్యత్ నిర్వహణకు సంబంధించి ఒమన్తో జరుగుతున్న చర్చల్లో పురోగతి ఉందని ఇరాన్ సంకేతాలు ఇస్తోంది. ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ఈ వారం ప్రారంభంలో మాట్లాడుతూ.. హార్ముజ్ జలసంధి గుండా నౌకలు ప్రయాణించే భౌగోళిక మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం కుదిరిందని తెలిపారు.
ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ ప్రకారం.. నౌకల రాకపోకలకు ప్రతిపాదించిన మార్గానికి సంబంధించిన భౌగోళిక కోఆర్డినేట్లపై ఇరు దేశాలు అంగీకరించాయని బఘాయీ చెప్పారు. ఇరు పక్షాలు అంగీకరించిన ప్రధాన అంశాలతో కూడిన సంయుక్త ప్రకటన తుది దశలో ఉందని తెలిపారు. అయితే కొన్ని మూడో పక్షాలు ఈ ప్రక్రియకు అడ్డంకులు సృష్టించకపోతే ఒప్పందం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. అయితే ఒమన్తో అవగాహన కుదిరినంత మాత్రాన హార్ముజ్ జలసంధిలో సాధారణ నౌకాయానం వెంటనే పునరుద్ధరించబడుతుందని చెప్పలేమని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా నౌకాదళ దిగ్బంధనం, ఇరాన్పై కొనసాగుతున్న దూకుడు, బెదిరింపు చర్యల కారణంగా హార్ముజ్ భద్రతకు ముప్పు ఇంకా కొనసాగుతోందని బఘాయీ తెలిపారు.
హార్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. యుద్ధం ప్రారంభమయ్యే ముందు ప్రపంచ చమురు, ద్రవీకృత సహజ వాయువు (LNG) ఎగుమతుల్లో దాదాపు ఐదో వంతు ఈ జలసంధి గుండా రవాణా అయ్యేది. దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నప్పటికీ హార్ముజ్ జలసంధిలో భద్రతా పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి. బుధవారం ఓ చమురు ట్యాంకర్ హార్ముజ్ జలసంధి గుండా ఒమన్లోని కుమ్జార్కు ఆగ్నేయ దిశలో ప్రయాణిస్తున్న సమయంలో రెండు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు బ్రిటన్కు చెందిన సముద్ర భద్రతా సంస్థ యూకేఎంటీఓ తెలిపింది. అయితే నౌక, అందులోని సిబ్బంది సురక్షితంగానే ఉన్నట్లు వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు రెండు సౌదీ చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్లు ప్రకటించారు. హౌతీ సైనిక ప్రతినిధి యహ్యా సరీ మాట్లాడుతూ.. ఉత్తర ఎర్ర సముద్రంలో యన్బు సమీపంలో ‘వఫా’, గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో ‘డైసీ’ అనే చమురు ట్యాంకర్లపై క్షిపణులతో దాడి చేసినట్లు తెలిపారు. అయితే ఈ ఆరోపణలపై సౌదీ అధికారులు వెంటనే స్పందించలేదు.
ఇరాన్తో దౌత్యపరమైన చర్చలు త్వరగా ఫలితాన్నివ్వకపోవచ్చని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా అంగీకరించారు. ఈ వారం ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చర్చల ప్రక్రియ సంక్లిష్టంగా ఉంటుందని, ఫలితం రావడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. ఇరాన్ వ్యవస్థలో అంతర్గత విభేదాలు ఉన్నాయని, ఆ దేశంతో చర్చలు జరపడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని వాన్స్ వ్యాఖ్యానించారు. మరోవైపు హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ ఒప్పందం చేసుకోవాలని చూస్తోందని ట్రంప్ పదేపదే చెబుతున్నప్పటికీ.. ఇరాన్ మాత్రం ఆ వాదనను అంగీకరించడం లేదు. తమ చర్చలు ఒమన్కు మాత్రమే పరిమితమని, అమెరికాతో నేరుగా ఎలాంటి చర్చలు జరగడం లేదని టెహ్రాన్ స్పష్టం చేస్తోంది.

