టర్కీ పర్యటనలో ఉన్న అధ్యక్షుడు ట్రంప్ అకస్మా్త్తుగా ఇరాన్పై దాడులకు ఆదేశించారు. ఇరాన్తో శాంతి ఒప్పందం ముగిసిందని.. ఇక దాడులే ఉంటాయని హెచ్చరించారు. దీంతో ప్రపంచమంతా మరోసారి ఉలిక్కిపడింది. శాంతి ఒప్పందంతో అంతా ప్రశాంతంగా ఉందనుకుంటున్న తరుణంలో ట్రంప్ మళ్లీ దాడులకు ఆదేశాలు ఇవ్వడంతో మధ్యప్రాచ్యం ఒక్కసారిగా రణరంగంగా మారింది. ఓ వైపు ఖమేనీ అంత్యక్రియలు.. ఇంకోవైపు లక్షలాది మంది రోడ్లపై నివాళులర్పిస్తున్నారు. ఇలాంటి తరుణంలో అమెరికా దాడులకు దిగడంతో ఏం జరుగుతుందోనని ప్రపంచ దేశాలు భయపడ్డాయి. అసలు ఇంతకీ టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ కార్యాలయంలో ఏం జరిగింది. ట్రంప్ను ఏమని ఒప్పించారు. ఏం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరి రెండు వారాలు కూడా గడవకముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. ఒకవైపు ఇరాన్తో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని ముగిసినట్లేనని ప్రకటించగా.. మరోవైపు తాజాగా ఇరాన్పై భారీ సైనిక దాడులకు ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్కు ఇచ్చిన పలు సడలింపులను కూడా వెనక్కి తీసుకున్నారు. ఈ అకస్మాత్తు నిర్ణయం వెనుక వైట్హౌస్లోని ఓవల్ ఆఫీస్లో జరిగిన కీలక సమావేశమే కారణమని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టర్కీలో జరిగే నాటో శిఖరాగ్ర సమావేశానికి బయలుదేరే ముందు వైట్హౌస్లో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్తో పాటు జాతీయ భద్రతా బృందం పాల్గొంది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేసినట్లు గూఢచారి సంస్థలు సేకరించిన తాజా సమాచారాన్ని ట్రంప్కు అధికారులు వివరించారు. ఇరాన్ దళాలు యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశాయని, దక్షిణ సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలు దెబ్బతిన్నాయని తెలిపారు. వాటిలో ఒక ఎల్ఎన్జీ (ద్రవీభవించిన సహజ వాయువు) ట్యాంకర్ కూడా ఉన్నట్లు నివేదికల్లో పేర్కొన్నారు.
ఈ సమాచారంతో ట్రంప్.. ఇరాన్ ఇకపై శాంతి ఒప్పందాన్ని గౌరవించే ఉద్దేశంలో లేదని భావించినట్లు తెలుస్తోంది. అనంతరం జాతీయ భద్రతా బృందంతో చర్చించిన ట్రంప్.. ఇరాన్ నిజాయితీగా చర్చలు జరపడం లేదనే నిర్ణయానికి వచ్చి అమెరికా వైఖరిని పూర్తిగా మార్చేశారు. ఓవల్ ఆఫీస్ సమావేశం ముగిసిన కొద్ది గంటల్లోనే అమెరికా ప్రభుత్వం ఫ్రాన్స్లోని వెర్సాయ్ ప్యాలెస్లో కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందం (MoU)లో ఇచ్చిన పలు హామీలను వెనక్కి తీసుకుంది.
ఇరాన్కు ఇచ్చిన చమురు విక్రయ అనుమతిని రద్దు చేసింది. హార్ముజ్ జలసంధి పరిసరాల్లోని ఇరాన్ లక్ష్యాలపై వరుస వైమానిక దాడులకు అనుమతి ఇచ్చింది. అవసరమైతే తాగునీటి ప్లాంట్లు, విద్యుత్ కేంద్రాలు వంటి పౌర మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు. అయితే అలాంటి పరిస్థితి రాకూడదని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ‘‘నా దృష్టిలో ఆ ఒప్పందం ముగిసిపోయింది. ఇక వారితో వ్యవహరించాలనే ఉద్దేశం లేదు. వాళ్లు అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసగాళ్లు.’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ ఆరోపణ
అమెరికా ఆరోపణలను ఇరాన్ ఖండించింది. హార్ముజ్ జలసంధిలో తమ అనుమతి లేకుండానే అమెరికా వాణిజ్య నౌకలకు ప్రత్యేక సముద్ర మార్గాన్ని ఏర్పాటు చేసి ఒప్పందాన్ని మొదట అమెరికానే ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపించింది. తాత్కాలిక ఒప్పందంలో అమెరికా వాణిజ్య నౌకలకు ప్రత్యేక రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేసే అధికారం లేదని ఇరాన్ ప్రతినిధులు తెలిపారు. అందుకే ఆ మార్గాన్ని ఉపయోగిస్తున్న నౌకలపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు ఎవరు భద్రత కల్పించాలి? ఎవరు నియంత్రించాలి? అనే అంశంపై ఒప్పందంలో స్పష్టత లేకపోవడమే ప్రస్తుతం రెండు దేశాల మధ్య ప్రధాన వివాదంగా మారింది.
ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం హార్ముజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. అందుకే ఇది ప్రపంచంలో అత్యంత వ్యూహాత్మక సముద్ర మార్గాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అమెరికా అధికారుల ప్రకారం.. గత కొన్ని వారాలుగా ఒమన్ తీరానికి సమీపంలోని దక్షిణ సముద్ర మార్గం గుండా అమెరికా నౌకాదళం రక్షణలో వాణిజ్య నౌకలను తరలిస్తోంది. ఇప్పటికే 125కిపైగా నౌకలు ఈ మార్గంలో ప్రయాణించినట్లు తెలిపారు. చాలా నౌకలు రాత్రివేళల్లో ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను నిలిపివేసి అమెరికా నౌకాదళంతో రేడియో ద్వారా మాత్రమే సంప్రదింపులు కొనసాగించాయని వెల్లడించారు. అమెరికా ఈ చర్యను వాణిజ్య నౌకల భద్రత కోసమే చేపట్టామని చెబుతుండగా.. ఇరాన్ మాత్రం నౌకలు తమ తీరానికి సమీపంలోని ఉత్తర సముద్ర మార్గాన్నే ఉపయోగించాలని పట్టుబట్టింది.
తాజాగా భారీ సైనిక దాడులు
వాణిజ్య నౌకలపై దాడుల అనంతరం అమెరికా సైన్యం హార్ముజ్ జలసంధి పరిసరాల్లోని ఇరాన్ సైనిక స్థావరాలపై వరుస దాడులు నిర్వహించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం.. అంతర్జాతీయ నౌకాయానానికి ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని తగ్గించడమే ఈ దాడుల లక్ష్యమని తెలిపింది. గత రెండు రోజుల్లోనే 170కుపైగా ఇరాన్ సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ.. ఇరాన్ తన చర్యలను కొనసాగిస్తే అమెరికా ‘‘ఇంకా లోతుగా.. ఇంకా తీవ్రంగా’’ దాడులు చేస్తుందని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా.. ఇరాన్ ఇప్పటికే బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరిపింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రస్థాయికి చేరుకున్నాయి. రెండు వారాల క్రితం కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం కూలిపోవడంతో అమెరికా-ఇరాన్ సంబంధాలు మరోసారి యుద్ధ దిశగా పయనిస్తున్నాయి. రెండు దేశాలు కూడా ఒప్పందం విఫలమవడానికి పరస్పరం ఒకరినొకరు బాధ్యులుగా ఆరోపిస్తున్నాయి.

