Site icon NTV Telugu

Trump-Kharg Island: ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ కన్ను.. తాజా మాస్టర్ ప్లాన్ ఇదే!

Trump

Trump

ఆ ద్వీపం… ఇరాన్‌కు ఆయువు పట్టు. ఇరాన్ కిరీట రత్నం. బంగారు కొండ. బలమైన ఆర్థిక వ్యవస్థ. అలాంటి ద్వీపంపై ఇప్పుడు ట్రంప్ కన్ను పడింది. గత కొద్దిరోజులుగా ఇరాన్ సామ్రాజ్యాన్ని అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నాశనం చేస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ కంచుకోటైన ‘‘ఖర్గ్ ద్వీపం’’పై ట్రంప్ మనసు పడింది. ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని అధ్యక్షుడు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం వ్యూహాత్మక మేథోమధనం చేస్తున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇరాన్‌లో ప్రభుత్వ మార్పు కోసం అమెరికా ఎప్పుటి నుంచో ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ అంతమొందించాయి. దీంతో ఇరాన్‌లో మార్పు జరుగుతుందని అంతా భావించారు. కానీ ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై భీకర దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఇరాన్ కూడా దెబ్బకు దెబ్బ కొడుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఆర్థిక శక్తిపై దెబ్బకొట్టాలని అమెరికా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఖర్గ్ ద్వీపం దగ్గర అమెరికా బలగాలు మోహరింపజేసేలా ట్రంప్ ఆదేశాలు ఇచ్చినట్లుగా అమెరికా అధికారులు ఆక్సియోస్‌తో పేర్కొన్నారు.

మరోవైపు హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆయా దేశాలకు చెందిన ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. దీంతో హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేందుకు మిత్రదేశాలతో కలిసి సంకీర్ణ కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. ఈ వారంలోనే ఆ ప్రకటన కూడా రావొచ్చని తెలుస్తోంది.

ఇరాన్ విశ్వరూపమే..
ఇదిలా ఉంటే అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నట్లుగా ఖర్గ్ ద్వీపాన్ని గనుక అమెరికా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తే మాత్రం పరిణామాలు మరింత తీవ్రం రూపం దాల్చే అవకాశం ఉందని సంకేతాలు కనిపిస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో.. ముఖ్యంగా సౌదీ అరేబియాలోని చమురు కేంద్రాలు, పైప్‌లైన్‌లపై ఇరాన్ భీకర దాడులు చేయొచ్చని.. ఇది మరింత సంక్షోభానికి దారి తీయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే పరిస్థితి తలెత్తితే ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ కోసం అల్లాడిపోవడం ఖాయం.

ఖర్గ్ ద్వీపం..
ఖర్గ్ ద్వీపం.. ఇది ఇరాన్‌కు 25 కి.మీ దూరంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. ఇది ద్వీపం కాదు.. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటిది. ఈ ఖర్గ్ ద్వీపాన్ని గనుక అమెరికా ముట్టుకుంటే ప్రపంచ దేశాలకు చమురు సంక్షోభం తీవ్రస్థాయిలో తలెత్తి అల్లాడిపోయే పరిస్థితులు దాపురిస్తాయి. ఫైనాన్సియల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ప్రతి రోజు 7 మిలియన్ బ్యారెళ్ల చమురును లోడ్ చేస్తోంది. విదేశాలకు విక్రయించే 10 బ్యారెళ్ల చమురులో తొమ్మిది బ్యారెళ్ల చమురు ఇక్కడ నుంచే వెళ్తాయి. ఈ ద్వీపానికి దక్షిణ భాగంలో డజన్ల కొద్దీ నిల్వ ట్యాంకులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు కూడా వెలుగులోకి వచ్చాయి.

ఖర్గ్ ద్వీపం కొన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. 1960 నుంచి ఇరాన్‌కు ప్రధాన ఎగుమతి కేంద్రంగా ఉంది. దీన్ని అమెరికాకు చెందిన అమెకో కంపెనీనే నిర్మించిందని నివేదికలు ఉన్నాయి. చమురు రవాణా ఎక్కువ భాగం ఇక్కడ నుంచే ప్రపంచ దేశాలకు వెళ్తుంటాయి. ప్రస్తుతం ఖర్గ్ ద్వీపంలోని చమురు కేంద్రం చాలా చురుగ్గా పని చేస్తోందని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఇరాన్ మాత్రం హార్ముజ్ జలసంధిని మూసేయడంతో ఎక్కడికక్కడే ట్యాంకర్లు ఆగిపోయి ఉన్నాయి. దీంతోనే చమురు సంక్షోభం తలెత్తింది.

Exit mobile version