Site icon NTV Telugu

Donald Trump Tariff Hike: వెనక్కి తగ్గని ట్రంప్.. మరోసారి టారిఫ్‌లు పెంచిన అమెరికా అధ్యక్షుడు

Donald Trump

Donald Trump

Donald Trump Tariff Hike: “దశాబ్దాల దోపిడీని ఇకపై సహించం…” అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆయన తన వ్యూహాన్ని మార్చి, ప్రపంచ దేశాలపై విధించే సుంకాలను మళ్లీ పెంచారు.. 10 శాతం టారిఫ్‌ను 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు దేశీయ పరిశ్రమలను రక్షించడానికి ఈ చర్య తప్పనిసరని ట్రంప్ పేర్కొన్నారు.

సోషల్ మీడియా వేదికగా ట్రంప్‌ చేసిన ప్రకటనలోని ముఖ్యాంశాలు విషయానికి వస్తే.. పెంచిన 15 శాతం సుంకాలు తక్షణమే అమలులోకి వస్తాయి. అనేక దేశాలు దశాబ్దాలుగా అమెరికా మార్కెట్‌ను వాడుకుంటూ అనుచిత లబ్ధి పొందుతున్నాయని, ఇకపై అది సాగదని ఆయన స్పష్టం చేశారు. ఈ సుంకాల పెంపు పూర్తిగా చట్టబద్ధమైనదని, గతంలోనే దీనిపై తగిన కసరత్తు జరిగిందని ట్రంప్ పేర్కొన్నాడు.. తన పరిపాలన ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ దిశగా పయనిస్తోందని, కొత్త సుంకాలు ఆ వ్యూహంలో అంతర్భాగమని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు అమెరికాకు మంచి ఫలితాలను ఇచ్చాయని, భవిష్యత్తులో మరిన్ని దేశాలపై కొత్త రేట్లను విధించే అవకాశం ఉందని ఆయన సూచించారు.

భారత్‌పై ప్రభావం ఏమిటి?
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ నిర్ణయం ప్రపంచ వాణిజ్యంలో కొత్త ఉద్రిక్తతలకు దారితీయవచ్చు. భారతదేశం వంటి ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అమెరికాకు ఎగుమతి చేసే వస్తువుల ధరలు పెరగడం వల్ల భారతీయ వ్యాపారులకు పోటీ కష్టతరమవుతుంది. అమెరికా చర్యకు ప్రతిస్పందనగా ఇతర దేశాలు కూడా ప్రతికార సుంకాలు (Retaliatory Tariffs) విధిస్తే, అది గ్లోబల్ ట్రేడ్ వార్‌కు దారితీసే ప్రమాదం ఉంది. అయితే, ట్రంప్ పరిపాలన ఇంకా పూర్తిస్థాయి జాబితాను విడుదల చేయనందున, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు మరియు వాటాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ట్రంప్ తీసుకున్న ఈ దూకుడు నిర్ణయం అమెరికా తయారీ రంగాన్ని పెంచుతుందా లేదా అంతర్జాతీయ సంబంధాలను దెబ్బతీస్తుందా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ అమెరికా తదుపరి అడుగుల కోసం నిశితంగా గమనిస్తున్నాయి.

Exit mobile version