అమెరికా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని పెద్ద కంపెనీలకు కోవిడ్ వ్యాక్సిన్ను తప్పని సరి చేసింది అమెరికా ప్రభు త్వం. దేశంలోని వాణిజ్య సంస్థలో పనిచేసే ఉద్యోగులు జనవరి4 లోగా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలని లేదంటే వారానికోసారి కోవిడ్-19 టెస్టు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. గురువారం నుంచే ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. 100 మందికి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
సంస్థలకు భారీ జరిమానా..
గడువులోగా ఉద్యోగులు, కార్మికులు టీకా కార్యక్రమం పూర్తి కాకపోతే ఒక్కో ఉల్లంఘనకు 14వేల డాలర్లు(సుమారు రూ.10 లక్షలు) జరిమానా ఉంటుందని వృత్తిపరమైన రక్షణ, హెల్త్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఈ రూల్స్ను మొదటగా సెప్టెంబర్లో సమీక్షించారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా 84 మిలయ న్ల మంది ఉద్యోగులు, కార్మికులపై ప్రభావం చూపనుంది.
నర్సింగ్ హోమ్స్, ఆస్పత్రులు, ఇతర మెడికల్ విభాగంలో 17 మిలియన్ సిబ్బందికి ఈ నిబంధనలు వర్తిస్తాయని వృత్తిపరమైన రక్షణ, హెల్త్ అడ్మినిస్ట్రేషన్ (ఓషా) తెలిపింది. అయితే వీరికి టెస్టింగ్ ఆప్షన్ లేదని, వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించింది. కొత్త నిబంధనలతో పాటు వాణిజ్య సంస్థలు, కార్మిక యూనియన్లతో సమావేశాలు ఏర్పాటు చేసి సమగ్రమైన విధానాన్ని అనుసరించనుంది బైడెన్ సర్కార్.
