కెనడాలో మరో ఘోరం జరిగింది. ఇటీవల టొరంటోలో 30 ఏళ్ల భారతీయ మహిళ హిమాన్షి ఖురానా హత్య ఘటన మరువక ముందే మరో భారతీయ విద్యార్థి శివంక్ అవస్థి (20) హత్యకు గురయ్యాడు. దీంతో భారతీయుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
టొరంటో విశ్వవిద్యాలయంలోని స్కార్బరో క్యాంపస్ సమీపంలో మంగళవారం 20 ఏళ్ల భారతీయ విద్యార్థి శివంక్ అవస్థిపై దుండగుడు కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలతో ఉండగా పోలీసులు గమనించారు. ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తు్న్నారు. ఈ ఏడాది టొరంటోలో జరిగిన 41వ హత్య కేసుగా పోలీసులు తెలిపారు.
‘‘మంగళవారం మధ్యాహ్నం సుమారు 3:34 గంటలకు హైలాండ్ క్రీక్ ట్రైల్, ఓల్డ్ కింగ్స్టన్ రోడ్ ప్రాంతంలో గుర్తుతెలియని కాల్పై పోలీసులు స్పందించారు. తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తి గురించి సమాచారం తెలియగానే అధికారులు స్పందించారు. తుపాకీ గాయంతో ఒక ఉన్న బాధితుడిని అధికారులు గుర్తించారు. బాధితుడు అక్కడికక్కడే మరణించాడు.’’ అని పోలీసులు బుధవారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. పోలీసులు వచ్చేలోపు నిందితుడు ఆ ప్రాంతం నుంచి పారిపోయాడని ప్రకటనలో పేర్కొంది.
శివంక్ అవస్థ హత్యపై భారత కాన్సులేట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటన విషాదకరమైన ఘటనగా పేర్కొంది. శివంక్ అవస్థి కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తున్నట్లు టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ తెలిపింది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు వెల్లడించింది.
