SCO Summit 2026: సింధు జలాల ఒప్పందంపై షాబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు

Shahbaz Sharif

Shahbaz Sharif

SCO Summit 2026: భారత్–పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందంపై వివాదం మరింత ముదురుతోంది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంపై పాకిస్థాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై పదేపదే ప్రస్తావిస్తున్న పాకిస్థాన్.. తాజాగా షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులోనూ లేవనెత్తింది. 2026-27 సంవత్సరానికి SCO అధ్యక్ష పదవిని పాకిస్థాన్ చేపట్టిన నేపథ్యంలో బిష్కెక్‌లో జరిగిన SCO దేశాధినేతల మండలి శిఖరాగ్ర సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ మాట్లాడారు. నీరు ఈ ప్రాంతానికి జీవనాధారమని పేర్కొంటూ, దానిని ఎప్పుడూ ఆయుధంగా, ఒత్తిడి సాధనంగా లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని అన్నారు.

ఉమ్మడి జల వనరులకు సంబంధించిన ఒప్పందాలు అంతర్జాతీయంగా కట్టుబడి ఉండే బాధ్యతలని షాబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. అలాంటి ఒప్పందాలను ఎలాంటి షరతులు లేకుండా తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే, పాకిస్థాన్ ఎదుర్కొంటున్న ఉగ్రవాద సమస్య, దానిపై తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించలేదు.

హేగ్ కోర్టు తీర్పు.. భారత్ తిరస్కరణ
సింధు జలాల ఒప్పందంపై ఆగస్టు 31న హేగ్‌లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కీలక నిర్ణయం వెలువరించింది. 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందం అమల్లోనే ఉందని, భారత్ దాని బాధ్యతలను కొనసాగించాలని కోర్టు పేర్కొంది. అలాగే జమ్మూకశ్మీర్‌లోని రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని నిర్మాణ పనులను పరిమితం చేయాలని మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ తీర్పును భారత్ తీవ్రంగా తిరస్కరించింది. హేగ్‌లోని ఈ కోర్టును తాము గుర్తించలేదని, అది చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేయబడిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత సార్వభౌమ నిర్ణయాలపై తీర్పు ఇచ్చే అధికారం ఆ కోర్టుకు లేదని పేర్కొంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ అంతర్జాతీయ వేదికలపై సింధు జలాల అంశాన్ని మరింత బలంగా ప్రస్తావిస్తోంది. మరోవైపు, భారత్ మాత్రం హేగ్ కోర్టు ఆదేశాలను అంగీకరించేది లేదని తేల్చిచెప్పింది. దీంతో సింధు జలాల ఒప్పందంపై ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.