Russian attacks on Ukraine targeting power grid: విద్యుత్ వ్యవస్థే లక్ష్యంగా రష్యా, ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. శీతాకాలం రావడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించి దేశం నుంచి వలసలు పెంచాలనే ఆలోచనలతోనే రష్యా ఇలా చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఇదే విధంగా రష్యా ఆక్రమిత క్రిమియాలో ఇరాన్ జాతీయులు..కామికేజ్ డ్రోన్లను నిర్వహించేందుకు సహాయపడుతున్నారని అమెరికా, ఉక్రెయిన్ ఆరోపిస్తున్నాయి. రష్యాకు సహాయం చేయడానికి ఇరాన్ తన సిబ్బందిని పంపిందని ఆరోపణలు గుప్పించాయి.
యుద్ధంలో రష్యా, ఇరాన్ తయారీ కామికేజ్ డ్రోన్లను వినియోగిస్తోంది. వీటితో ఉక్రెయిన్ విద్యుత్ గ్రిడ్ వ్యవస్థలను కుప్పకూలుస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ లో మూడింట ఒక వంతు విద్యుత్ వ్యవస్థ దెబ్బతిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ వెల్లడించారు. కాగా.. రష్యాకు సహాయపడుతున్నందుకు ఇరాన్ పై అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కుబేలా కోరాడు. ఇప్పటికే యూరోపియన్ యూనియన్, యూకే రెండు రష్యాకు ఆత్మాహుతి డ్రోన్లను సరఫరా చేస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ముగ్గురు ఇరాన్ జనరల్స్, ఒక ఆయుధ సంస్థపై ఆంక్షలు విధించాయి.
Read Also: Karthi Sardar Movie: సర్దార్ సినిమా ఇలా ఉంటుందనుకోలేదు.. ట్విట్టర్ టాక్
శీతాకాలం ముంచుకువస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థలను పునరుద్ధరించే పనిలో ఉన్నాయి. 30 శాతం విద్యుత్ కేంద్రాలు ధ్వంసం అయ్యాయి. తమ దేశంలో ఇంధన సంక్షోభం సృష్టించి ప్రజలు యూరప్ దేశాలకు పారిపోయేలా రష్యా ప్రణాళిక రచించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ అన్నారు. ఇంధన వ్యవస్థను రష్యా యుద్ధభూమిగా మార్చిందని అన్నారు. రాజధాని కీవ్ తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఖేర్సన్ నగరంలో జలవిద్యుత్ కేంద్రంపై రష్యా దాడికి ప్రయత్నిస్తోందని జెలన్ స్కీ ఆరోపించారు. కఖోవ్కా జలవిద్యుత్ కేంద్రాన్ని ధ్వంసం చేస్తే పెద్ద స్థాయి విపత్తు ఏర్పడుతుందని ఆయన అన్నారు.
