అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన ప్రధాని మోడీ సమావేశం ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఎదురయ్యే సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలన్నదానిపై మోడీ దిశా నిర్దేశం చేశారు. ఇక ఈ సమావేశంలో ఎక్కడా కూడా లాక్డౌన్ అంశాన్ని ప్రస్తావించలేదు. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమని తేలిపోయింది. గత కొద్దిరోజులుగా ప్రజల్లో లాక్డౌన్ భయాందోళనలు రేకెత్తించారు. నేటి ప్రధాని మోడీ సమావేశంతో ఈ వార్తలు నిజం కాదని తేలిపోయింది. ఈ భేటీకి ముందు కూడా కేంద్రం కూడా లాక్డౌన్ వార్తలను కొట్టిపారేసింది.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో అనుసరించిన సహకార సమాఖ్య వ్యూహాన్ని మోడీ గుర్తుచేశారు. ‘‘టీమిండియా’’ విధానాన్ని నొక్కి చెప్పారు. ఇంధనం, ఎరువులు, భద్రతపై ప్రభావం చూపే దీర్ఘకాలిక ప్రపంచ అంతరాయాల గురించి హెచ్చరిస్తూనే.. కష్టాలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలిసి కట్టుగా సంక్షోభాన్ని జయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లో సమన్వయం ఉండేలా చూడటమే దీని లక్ష్యం. ఇక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరు కాలేదు.
ఇక పశ్చిమాసియా సంఘర్షణ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి కేంద్రం మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేసింది. సవాళ్లను పరిష్కరించేందుకు రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఒక అంతర్-మంత్రివర్గ బృందాన్ని (ఐజీఎం) ఏర్పాటు చేసింది. ఇందులో అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరి కీలక సభ్యులుగా ఉన్నారు.
ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఛత్తీస్గఢ్ విష్ణు దేవ్సాయి, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, పంజాబ్ భగవంత్ మాన్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు.
ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం జరగనుంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల కోసం కేబినెట్ సెక్రటేరియట్ ద్వారా ప్రత్యేక సమావేశం జరగనుంది.
