Afghanistan: ఒకప్పుడు ఫేమస్ న్యూస్ యాంకర్.. ఇప్పుడు వీధి వ్యాపారి

Afgan Taliban

Afgan Taliban

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత అక్కడ చాలా మంది జీవితాలు తలకిందులయ్యాయి. ఆఫ్ఘన్ లో ప్రజా ప్రభుత్వ ఉన్న సమయంలో  స్త్రీలు ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహించే వారు. అయితే తాలిబన్ల పాలన వచ్చిన తర్వాత కేవలం వంటిళ్లకే పరిమితం అయ్యారు. బయటకు వెళ్లాలన్నా.. భర్త లేదా బంధువులు తోడుంటేనే అనుమతి.. కాదని రూల్స్ ఉల్లంఘిస్తే కొరడా దెబ్బలతో శిక్షించడం ఇది తాలిబన్ల రాక్షస పాలన.

తాజాగా తాలిబన్ పాలనలో ఓ ఆఫ్ఘన్ జర్నలిస్టు పరిస్థితి తలకిందులైన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. మూసా మొహమ్మదీ కథ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రజా ప్రభుత్వం ఉన్న సమయంలో మొహమ్మదీ టాప్ న్యూస్ యాంకర్, జర్నలిస్టుగా ఉండేవాడు. అనేక ఛానెళ్లలో యాంకర్, రిపోర్టర్ గా చాలా ఏళ్లు పనిచేశాడు. ఇప్పుడు అతని కుటుంబాన్ని పోషించుకోవడానికి వీధుల్లో తినుబండారాలను అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నాడు.

ఇటీవల హమీద్ కర్జాయ్ ప్రభుత్వంలో పనిచేసిన కబీర్ హక్మల్ ఇటీవల ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు.. దేశంలో అనేక ప్రతిభావంతులైన నిపుణులు పేదరికంలోకి ఎలా నెట్టబడ్డారో చూపించారు. మొహమ్మదీ కథ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఈ విషయం నేషనల్ రేడియో, టెలివిజన్ డైరెక్టర్ జనరల్ అహ్మదుల్లా వాసిక్ దృష్టికి వచ్చింది. తన డిపార్ట్ మెంట్ లో మొహమ్మదీని నియమిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత దేశంలో ఆర్థిక, మనవతా సంక్షోభం ఏర్పడింది. చాలా మంది ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడ్డారు. ఏకంగా పిల్లలను అమ్ముకోవడంతో పాటు వాళ్ల అవయవాలను కూడా అమ్ముకుని బతుకుబండిని నెట్టుకొస్తున్నారు. ముఖ్యంగా అనేక మంది జర్నలిస్టులు, మహిళా ఉద్యోగులు వాళ్ల ఉద్యోగాలను కోల్పోయారు.