Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!

  • ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి‌కి చైనా వార్నింగ్
  • స్టేజ్‌పై ఉండగా చైనా నోట్
  • వేదికపైనే చదివిన మంత్రి
Chinanote2

Chinanote2

ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి గిల్బెర్టో సీ. టియోడోరో వేదికపై ఉండగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రసంగిస్తుండగా చైనా నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో స్టేజ్‌పైనే ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి చదివి వినిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దక్షిణ చైనా సముద్రంపై తమ వైఖరిని వివరిస్తూ చైనా పంపిన నోట్‌ను ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి గిల్బెర్టో సీ. టియోడోరో బహిరంగ వేదికపైనే చదివి వినిపించారు. అనంతరం చైనాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటన దక్షిణ కొరియాలో జరిగిన సియోల్ డిఫెన్స్ డైలాగ్ 2026 సందర్భంగా చోటుచేసుకుంది. టియోడోరో ప్రసంగిస్తుండగా తెల్లటి కోటు ధరించిన ఓ వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి టేబుల్‌పై ఓ కాగితాన్ని ఉంచారు. ఆ వ్యక్తి ఈవెంట్ వాలంటీర్ అయి ఉండొచ్చని భావిస్తున్నారు. “నా దగ్గర ఒక నోట్ ఉంది. ఇది చైనా నుంచి వచ్చినట్లు అనిపిస్తోంది” అని టియోడోరో ప్రసంగాన్ని మధ్యలో ఆపి చెప్పారు. అనంతరం దాన్ని చదవాలా? అంటూ సభికులను అడిగారు. ఆ తర్వాత ఆ నోట్‌లోని విషయాలను బహిరంగంగా చదివి వినిపించారు.

దక్షిణ చైనా సముద్రంపై చైనా వైఖరి

ఆ నోట్‌లో దక్షిణ చైనా సముద్రంపై చైనా అధికారిక వైఖరిని ప్రస్తావించారు. “దక్షిణ చైనా సముద్రంపై మధ్యవర్తిత్వానికి సంబంధించి చైనా వైఖరి స్పష్టంగా, స్థిరంగా, దృఢంగా ఉంది. మధ్యవర్తిత్వ ప్రక్రియ అంతర్జాతీయ చట్టంలోని ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించిందని పేర్కొంది. ఫిలిప్పీన్స్‌కు అనుకూలంగా వచ్చిన తీర్పు చట్టవిరుద్ధమైనదని.. చెల్లుబాటు కాదని.. ఎలాంటి బంధన శక్తి లేదు. ఆ తీర్పును తాము అంగీకరించబోమని.. గుర్తించబోమని.. దానికి వ్యతిరేకమని.. దాని ఆధారంగా వచ్చే ఎలాంటి హక్కుల వాదనలను కూడా ఎప్పటికీ అంగీకరించబోమని” నోట్‌లో పేర్కొన్నారు. ఈ సందేశం 2016లో ఫిలిప్పీన్స్.. ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందం (UNCLOS) కింద చైనాపై దాఖలు చేసిన న్యాయపరమైన కేసుకు సంబంధించినదిగా భావిస్తున్నారు.

ఈ కేసులో తీర్పు ఫిలిప్పీన్స్‌కు అనుకూలంగా వచ్చింది. దక్షిణ చైనా సముద్రంపై చైనా చేస్తున్న విస్తృత హక్కుల వాదనల్లోని కీలక అంశాలు, ముఖ్యంగా నైన్-డ్యాష్ లైన్, భూభాగ విస్తరణ కార్యకలాపాలు, ఫిలిప్పీన్స్ జలాల్లో చేపట్టిన కొన్ని చర్యలు చట్టవిరుద్ధమని మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ తేల్చింది. అయితే చైనా ఈ తీర్పును మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. వివాదాస్పద సముద్ర జలాల్లో ఫిలిప్పీన్స్ తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తోందని బీజింగ్ ఆరోపిస్తోంది. దీంతో ఇరు దేశాల నౌకాదళాల మధ్య పలుమార్లు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

“ఇది సరైన ప్రవర్తనా?”

నోట్‌లోని కొంత భాగాన్ని చదివిన అనంతరం టియోడోరో సభికుల వైపు తిరిగి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “అంతర్జాతీయ వేదికపై ఒక దేశం ఇలా వ్యవహరిస్తే.. నన్ను అడిగిన ప్రశ్నకు అతీతంగా, ఈ కార్యక్రమ నిర్వాహకులను కూడా అవమానిస్తే.. అలాంటి దేశంతో మీరు నాగరికంగా ఎలా వ్యవహరించాలని ఆశిస్తారు?” అని ప్రశ్నించారు. “నేను మిమ్మల్ని అడుగుతున్నాను.. నేను వేదికపై ప్రశ్నకు సమాధానం ఇస్తున్న సమయంలో నాకు ఇలాంటి కాగితం ఇవ్వడం సరైనదేనా? ఇలాంటి ప్రవర్తనను మీరు ఎలా చూస్తారు?” అని అన్నారు.

“ఇది బెదిరింపు, వేధింపు, దూకుడు చర్య”

చైనా చర్య అంతర్జాతీయ చట్టాన్ని మాత్రమే కాకుండా.. ఈ కార్యక్రమానికి ఆతిథ్యమిస్తున్న దక్షిణ కొరియాను, అక్కడి ప్రేక్షకులను కూడా అవమానించిందని టియోడోరో అన్నారు. “ఇది (UNCLOS)ను నేలకేసి కొట్టడం, దానిని తొక్కిపారేయడం మాత్రమే కాదు.. మన ఆతిథ్య దేశమైన రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు, ఇక్కడి ప్రేక్షకులందరికీ ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని కూడా అవమానించడమే. కాబట్టి చైనా చేయాల్సిన పని బహుశా కనీస మర్యాద, సరైన ప్రవర్తనను పాటించడమే” అని వ్యాఖ్యానించారు. నోట్ అందజేయడాన్ని “నిజమైన బలవంతం, బెదిరింపు, వేధింపులు, దూకుడు చర్య”గా అభివర్ణించారు. నోట్‌ను అందజేసిన వ్యక్తిని ఉద్దేశించి టియోడోరో మరింత ఘాటుగా స్పందించారు.

“చైనా ఎంత నిరాశలో ఉందో, స్వేచ్ఛగా మాట్లాడుతున్న ప్రేక్షకుల ముందు దాని వైఖరి ఎంత అసమర్థంగా ఉందో గుర్తు చేసుకునేందుకు ఈ కాగితాన్ని జ్ఞాపికగా ఉంచుకుంటాను. ఈ కాగితం నాకు అందించినందుకు మీకు చాలా ధన్యవాదాలు. మీరు మీ దేశానికి ఇప్పుడే గొప్ప సేవ చేశారు” అని అన్నారు.

చైనాపై ఫిలిప్పీన్స్ ఆందోళనలు

ఈ ఘటనను టియోడోరో.. దక్షిణ చైనా సముద్రంలో చైనాతో ఫిలిప్పీన్స్‌కు ఉన్న విస్తృత భౌగోళిక, సార్వభౌమ వివాదాలను ప్రస్తావించేందుకు ఉపయోగించుకున్నారు. “ఫిలిప్పీన్స్ పరిస్థితి అందరికీ తెలిసిందే. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా నుంచి మేము ప్రతిరోజూ సవాళ్లను ఎదుర్కొంటున్నాం. మా భూభాగంపై, ముఖ్యంగా మా ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ)లో చైనా అక్రమంగా తన ఉనికిని కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది” అని ఆయన పేర్కొన్నారు. ఈ ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు ఫిలిప్పీన్స్ మరింత బలమైన భద్రతా భాగస్వామ్యాలు, కూటములను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. “మనం పరస్పరం అనుసంధానమైన ప్రపంచంలో జీవిస్తున్నాం. అంతర్జాతీయంగా అందరికీ చెందిన సముద్ర ప్రాంతాన్ని ఏ ఒక్క దేశమైనా తన ప్రత్యేక వినియోగం లేదా హక్కు కోసం స్వాధీనం చేసుకునే హక్కు లేదు. అంతర్జాతీయ నిబంధనలు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి” అని టియోడోరో అన్నారు.

వీడియోను విడుదల చేసిన ఫిలిప్పీన్స్ రక్షణ శాఖ

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఫిలిప్పీన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో తర్వాత షేర్ చేసింది. “రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని సియోల్‌లో జరిగిన సియోల్ డిఫెన్స్ డైలాగ్ (SDD) 2026 సందర్భంగా చైనా వైపు నుంచి వచ్చిన నోట్‌కు ఫిలిప్పీన్స్ జాతీయ రక్షణ మంత్రి గిల్బెర్టో సీ. టియోడోరో జూనియర్ స్పందించారు” అని క్యాప్షన్‌లో పేర్కొంది.

దక్షిణ చైనా సముద్రం ఇప్పటికీ ఫిలిప్పీన్స్, చైనాల మధ్య ప్రధాన భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తత కేంద్రంగా కొనసాగుతోంది. వివాదాస్పద సముద్ర ప్రాంతాల్లో ఒకరిపై మరొకరు సార్వభౌమ హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ ఇరు దేశాలు తరచూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. 2016 మధ్యవర్తిత్వ తీర్పును ఫిలిప్పీన్స్ తన న్యాయపరమైన వాదనలకు ఆధారంగా చేసుకుంటుండగా.. చైనా మాత్రం ఆ తీర్పును ఇప్పటికీ తిరస్కరిస్తోంది.