ISI Spy Trap: పాక్‌ ISI స్పై ట్రాప్‌.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్‌ ISI?

  • భారత్‌లో పాక్‌ ISI గూఢచర్య వల
  • సోషల్ మీడియా ద్వారా డిఫెన్స్ అధికారులే టార్గెట్!
Isi

Isi

Pakistan ISI Spy Trap in India: భారత్‌లో పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)కు సంబంధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గూఢచర్య నెట్‌వర్క్‌లపై మరోసారి చర్చ మొదలైంది. ఢిల్లీలో శుక్రవారం ఓ యువ దంపతులను అరెస్ట్ చేయడంతో, భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఇటీవలి కేసులను పరిశీలిస్తే.. ఆన్‌లైన్‌లో టార్గెట్లను గుర్తించడం, హనీట్రాప్‌లోకి లాగడం, రక్షణ సంస్థలు-మౌలిక వసతులకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నించడం వంటి అంశాలు పలువురు కేసుల్లో కనిపిస్తున్నాయని దర్యాప్తు వర్గాలు పేర్కొంటున్నాయి.

సోషల్ మీడియా ద్వారా టార్గెట్ల గుర్తింపు

దర్యాప్తు అధికారుల ప్రకారం, పాకిస్థాన్‌కు చెందిన ఏజెంట్లు సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించి భారత రక్షణ లేదా ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే వ్యక్తులను గుర్తించే అవకాశం ఉంది. యూనిఫాంలో ఉన్న అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు లేదా వ్యక్తిగతంగా బలహీనంగా ఉన్నట్లు కనిపించే వ్యక్తులను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. టార్గెట్‌ను గుర్తించిన తర్వాత, సాధారణంగా భారతీయ ఫోన్ నంబర్లతో నిర్వహించే సోషల్ మీడియా లేదా మెసేజింగ్ ఖాతాల ద్వారా పరిచయం ఏర్పరచుకునే ప్రయత్నం జరుగుతుందని చెబుతున్నారు.

మహిళల పేరుతో పరిచయం.. ఆ తర్వాత హనీట్రాప్

కొన్ని కేసుల్లో మహిళల ఫొటోలను ప్రొఫైల్‌లో ఉపయోగించిన ఖాతాల ద్వారా పరిచయం పెంచుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు అధికారులు చెబుతున్నారు. మొదట స్నేహపూర్వకంగా ప్రారంభమయ్యే సంభాషణలు తర్వాత వ్యక్తిగత విషయాలకు దారితీయవచ్చు. టార్గెట్ వ్యక్తి ప్రైవేట్ లేదా సన్నిహిత ఫొటోలను పంచుకున్న తర్వాత వాటిని ఉపయోగించి బ్లాక్‌మెయిల్ లేదా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. అనంతరం రక్షణ సంస్థలు, సైనిక కార్యకలాపాలు లేదా ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఢిల్లీ కేసులో భారత SIM కార్డుల వినియోగం ఆరోపణ

ఢిల్లీ కేసులో మొహమ్మద్ సాహిల్ (25), అతని భార్య సమీరా (21)లను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు ప్రకారం, ఈ దంపతులు 2024-2025 మధ్య కాలంలో ఎనిమిది భారతీయ SIM కార్డులను సేకరించి, దుబాయ్ మీదుగా పాకిస్థాన్‌కు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ SIM కార్డులను పాకిస్థాన్ నుంచి WhatsApp ఖాతాలను యాక్టివేట్ చేయడానికి ఉపయోగించినట్లు, తద్వారా భారతీయ గ్రూపుల్లోకి ప్రవేశించి సున్నితమైన సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారని సమాచారం.

‘న్యూడ్‌ ఫొటో’ ఎరగా.. కీలక సమాచారం కోసం ఒత్తిడి?

భారత రక్షణ, ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే వ్యక్తులను లక్ష్యంగా చేసుకునే క్రమంలో హనీట్రాపింగ్‌ ఒక పద్ధతిగా ఉపయోగిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవల మేలో అరెస్టైన ఓ సర్వింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) వింగ్ కమాండర్ పై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. పాకిస్థాన్‌కు చెందిన ఏజెంట్లుగా భావిస్తున్న వ్యక్తులతో ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడి, అనంతరం సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తు వర్గాల ప్రకారం, నగ్న ఫొటోలను పంపిస్తానని చెప్పి సైనిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పొందేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా సహోద్యోగి మొబైల్ ఫోన్‌లో సమాచారాన్ని దొంగిలించే సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసినట్లు కూడా ఆ అధికారిపై ఆరోపణలు నమోదయ్యాయి.

DRDO మాజీ శాస్త్రవేత్త కేసు

ఇలాంటి కేసుల్లో గతంలో DRDO మాజీ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌గా పేర్కొన్న “జారా దాస్‌గుప్తా” అనే వ్యక్తితో సంభాషణలు జరిపి, సున్నితమైన సమాచారాన్ని అందించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) ఆయనను 2023 మే 3న అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆయనపై దర్యాప్తు కొనసాగి, జూన్ చివరి నాటికి సుమారు 1,837 పేజీల ఛార్జ్‌షీట్ సిద్ధం చేసినట్లు సమాచారం.

మాస్కోలోని భారత రాయబార కార్యాలయ ఉద్యోగిపై కూడా ఆరోపణలు

2024 ప్రారంభంలో మరో కేసులో సతేంద్ర సివాల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. 2021 నుంచి మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ఇండియా-బేస్డ్ సెక్యూరిటీ అసిస్టెంట్ (IBSA)గా పనిచేసిన ఆయనకు సున్నితమైన రాయబార కార్యాలయ పత్రాలకు యాక్సెస్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆయనను కూడా హనీట్రాప్ ద్వారా గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ అరెస్ట్ చేసినట్లు సమాచారం.

సోషల్ మీడియా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి

ఈ కేసులు సోషల్ మీడియా ద్వారా తెలియని వ్యక్తులతో పరిచయం పెంచుకునే విషయంలో అప్రమత్తత అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ, రక్షణ రంగాల్లో పనిచేసే వ్యక్తులు తమ ఉద్యోగం, విధులు, కార్యాలయ వివరాలు లేదా సున్నితమైన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పంచుకోకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలియని వ్యక్తులు పంపే లింకులు, ఫైళ్లు, యాప్‌లు లేదా సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయకపోవడం, వ్యక్తిగత ఫొటోలు, పత్రాలను అపరిచితులతో పంచుకోకపోవడం సైబర్ భద్రతలో కీలకం.