NTV Telugu Site icon

Pakistan: “సిగ్గుపడాలి”.. పాక్ ప్రధానిపై విపరీతంగా ట్రోలింగ్..కారణం ఏంటంటే..?

Pakistan,

Pakistan,

Pakistan: పారిస్ ఒలింపిక్స్‌లో పాకిస్తాన్‌కి చెందిన 27 ఏళ్ల అర్షద్ నదీమ్‌ జావలిన్‌ త్రోలో స్వర్ణం గెలుచుకున్నాడు. భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న నీరజ్ చోప్రా రజతంలో సరిపెట్టుకున్నాడు. నదీమ్ స్వర్ణం సాధించడం పట్ల పాకిస్తాన్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి నదీమ్ రికార్డు స్థాయిలో 92.97 మీటర్ల త్రో సాయంతో స్వర్ణం సాధించారు. నీరజ్ చోప్రా 89.45 మీటర్ల దూరం త్రో చేసి రెండోస్థానంలో నిలిచి, రజతంతో సరిపెట్టుకున్నారు. పాకిస్తాన్ తరుపున స్వర్ణం సాధించిన తొలి వ్యక్తిగా అర్షద్ నదీమ్ నిలిచారు.

అర్షద్ గెలుపుపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభినందనలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా అతడిని అభినందించారు. ఇదిలా ఉంటే దీనికి తోడుగా నదీమ్‌కి 10 లక్షల రూపాయలు ఇచ్చినట్లు చూపిస్తున్న పాత ఫోటోని షరీఫ్ ఎక్స్‌లో పోస్ట్ చేయడం విమర్శలకు దారితీసింది. పాకిస్తాన్ వ్యాప్తంగా నెటిజన్లు పీఎం షహబాజ్ షరీఫ్‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నదీమ్ గెలుపుని తన ఖాతాలో వేసుకోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Manish sisodia: తీహార్ జైలు నుంచి మనీష్ సిసోడియా విడుదల.. 17 నెలల తర్వాత విముక్తి

పారిస్‌కి వెళ్లేందుకు అర్షద్‌కి పాకిస్తాన్ స్పాన్సర్ చేసినప్పటికీ, ఒలింపిక్స్‌కి కొన్ని నెలల ముందు కొత్త జావెలిన్ కోసం ఆయన చేసిన విజ్ఞప్తిని అక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదు. మార్చిలో నదీమ్ మీడియాలో మాట్లాడుతూ.. తన పాత జావెలిన్‌ని స్థానంలో కొత్తది కావాలని అధికారుల్ని కోరారు. అయితే, ఆ పాతదానినే 7-8 ఏళ్లు ఉపయోగించినట్లు అర్షద్ చెప్పాడు.

2020లో టోక్యో ఒలింపిక్స్ సమయంలో ప్రభుత్వం అతని ప్రయాణానికి ఎలాంటి ఆర్థిక సాయాన్ని అందించలేదు. అతని స్నేహితులు, పొరుగువారు అతడి ఖర్చుల కోసం సహకరించారు. ఈ విషయాలు వెలుగులోకి రావడంపై అక్కడి ప్రజలు పాక్ ప్రభుత్వంతో పాటు పీఎం షరీఫ్‌ని తూర్పారపడుతున్నారు. ‘‘ వారి మనస్తత్వం చూడండి, మీరు అతడికి రూ.1 మిలియన్ చెక్కును ఇచ్చినట్లు ఎందుకు పోస్ట్ చేశారు..?’’ అని ట్వీట్ చేశారు. ‘‘ఇది దేశానికి, అర్షద్‌‌కి అవమానం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందించకుండా, ఒకప్పటి ఫోటోని పోస్ట్ చేయడంపై సిగ్గుపడాలి’’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, కనీసం గ్రేస్‌ఫుల్ గా అభినందించండి… ఈ యువకుడు చేసిన పని అమూల్యమైనది. నిషానే ఇంతియాజ్ కోసం అతన్ని సిఫార్సు చేయండి’’ అని మరొకరు ట్వీట్ చేశాడు.