Pakistan: మరో గల్ఫ్ దేశంతో పాక్ రక్షణ ఒప్పందం.. కన్నేసుంచిన భారత్

  • మరో గల్ఫ్ దేశంతో పాక్ రక్షణ ఒప్పందం
  • అసిమ్ మునీర్ నేతృత్వంలో మరో దౌత్య విజయం
  • ప్రత్యేకంగా కన్నేసుంచిన భారత్
Pakistan

Pakistan

దాయాది దేశం పాకిస్థాన్ మరో గల్ఫ్ దేశంతో రక్షణ ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే సౌదీతో రక్షణ ఒప్పందం చేసుకుంది. ఒక దేశంపై ఎవరైనా దాడి చేస్తే.. శత్రు దేశంపై రెండు దేశాలు పోరాడాలనేది రక్షణ ఒప్పందం యొక్క సూత్రం. తాజాగా కువైట్‌‌తో కూడా రక్షణ ఒప్పందం చేసుకుంది. దీంతో పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ మరో దౌత్య విజయం సాధించాడు. కువైట్ ప్రభుత్వం పాకిస్థాన్‌తో కుదుర్చుకున్న ఐదేళ్ల రక్షణ సహకార ఒప్పందానికి అధికారికంగా ఆమోదం లభించింది. దీంతో గల్ఫ్ ప్రాంతంలో పాకిస్థాన్ సైనిక భాగస్వామ్యం మరింత విస్తరించనుంది. 2026 అమిరీ డిక్రీ నంబర్-73 ద్వారా ఈ ఒప్పందాన్ని కువైట్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. 2023 జూన్‌లో ఇరు దేశాలు సంతకం చేసిన రక్షణ ఒప్పందానికి ఇప్పుడు పూర్తి చట్టబద్ధత లభించింది.

ఒప్పందంలో ఏముంది?

కువైట్ సాయుధ దళాలు, పాకిస్థాన్ సాయుధ దళాలు అనేక రంగాల్లో కలిసి పనిచేయనున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం.. ఉమ్మడి సైనిక విన్యాసాలు, సైనిక శిక్షణ, ఉన్నత విద్య, నిఘా సమాచార మార్పిడి, లాజిస్టిక్ సహకారం, రక్షణ పరిశోధనలు, సైనిక సాంకేతికత అభివృద్ధి, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, రక్షణ తయారీ రంగంలో భాగస్వామ్యం వంటి అంశాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేయనున్నాయి. ఈ కార్యక్రమాల అమలును పర్యవేక్షించేందుకు ఉమ్మడి సైనిక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఒప్పందం ఐదేళ్ల పాటు అమల్లో ఉండగా.. ఎలాంటి అభ్యంతరం లేకపోతే ఆటోమేటిక్‌గా పొడిగించబడుతుంది.

సౌదీ ఒప్పందంతో తేడా ఇదే

అయితే ఈ ఒప్పందం సౌదీ అరేబియా-పాకిస్థాన్ మధ్య 2025లో కుదిరిన వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం మాదిరిగా లేదు. సౌదీ ఒప్పందంలో ఒక దేశంపై దాడి జరిగితే మరో దేశం సైనిక సహాయం అందించాల్సిన నిబంధనలు ఉండగా.. కువైట్-పాకిస్థాన్ ఒప్పందంలో అలాంటి పరస్పర రక్షణ బాధ్యతలు లేవు. ఇది ప్రధానంగా రక్షణ సహకారం, శిక్షణ, సాంకేతిక భాగస్వామ్యానికే పరిమితమైంది.

గల్ఫ్ దేశాలు ఎందుకు పాకిస్థాన్ వైపు?

ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలు, హౌతీ దాడులు, సముద్ర మార్గాల భద్రతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు తమ భద్రతా భాగస్వామ్యాలను విస్తరించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ పరిస్థితిని అవకాశంగా మలుచుకున్న పాకిస్థాన్.. తన సైన్యాన్ని ప్రాంతీయ భద్రతా భాగస్వామిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. సైనిక సలహాదారులు, శిక్షణ పొందిన సిబ్బంది, రక్షణ పరికరాల సరఫరా ద్వారా గల్ఫ్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేస్తూ.. ప్రతిఫలంగా ఆర్థిక సహాయం, పెట్టుబడులు, ఇంధన రాయితీలు, దౌత్య మద్దతు పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది.

భారత్ ఎందుకు అప్రమత్తమైంది?

ఈ పరిణామం భారత్‌కు తక్షణ భద్రతా ముప్పు కాకపోయినా.. నిశితంగా గమనించాల్సిన అంశంగా న్యూఢిల్లీ భావిస్తోంది. భారత్‌కు గల్ఫ్ దేశాలతో సుమారు 100 బిలియన్ డాలర్లకు పైగా ద్వైపాక్షిక వాణిజ్యం ఉంది. అలాగే ఇంధనం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. మరోవైపు గల్ఫ్ ప్రాంతంలో 85 లక్షలకు పైగా భారతీయులు నివసిస్తుండగా.. ఒక్క కువైట్‌లోనే 10 లక్షలకు పైగా భారతీయులు ఉన్నారు. అయితే పాకిస్థాన్‌తో కువైట్ రక్షణ సహకారం భవిష్యత్తులో నిఘా వ్యవస్థల వరకు విస్తరిస్తే.. అది భారత భద్రతా ప్రయోజనాలపై ప్రభావం చూపే అవకాశాన్ని భారత్ పరిశీలిస్తోంది. అలాగే అరేబియా సముద్రం, హోర్ముజ్ జలసంధి, బాబ్-అల్-మందెబ్ సముద్ర మార్గాల్లో పాకిస్థాన్ నౌకాదళ కార్యకలాపాలను కూడా భారత్ మరింత నిశితంగా పర్యవేక్షించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇండస్ జలాల ఒప్పందం అంశం, ఉగ్రవాదంపై భారత్ కఠిన వైఖరి, అంతర్జాతీయ వేదికలపై ఎదురవుతున్న ఒత్తిళ్ల మధ్య పాకిస్థాన్ గల్ఫ్ దేశాలతో రక్షణ ఒప్పందాలను విస్తరించడం ద్వారా ప్రాంతీయ భద్రతా భాగస్వామిగా తన ప్రాధాన్యతను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే గల్ఫ్ దేశాలతో భారత్‌కు ఉన్న బలమైన ఆర్థిక, ఇంధన, వ్యూహాత్మక సంబంధాలు కొనసాగుతున్నందున.. కేవలం సైనిక సహకారం ఆధారంగా పాకిస్థాన్ పెద్ద వ్యూహాత్మక ఆధిపత్యాన్ని సాధించడం అంత సులభం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.