Hindu Temple Demolition: పాకిస్థాన్లో మరోసారి పురాతన హిందూ ఆలయం కూల్చివేత వివాదానికి దారితీసింది. పంజాబ్ ప్రావిన్స్లోని నరోవాల్ జిల్లాలో సుమారు 100 నుంచి 125 ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ ఆలయం ధ్వంసమైనట్లు సమాచారం. ఈ ఆలయాన్ని మదర్సా విస్తరణ కోసం కూల్చివేశారంటూ మైనారిటీ సంఘాలు, పలు రాజకీయ పార్టీలు ఆరోపించగా.. భారీ వర్షాల కారణంగానే ఆలయం కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారం పాకిస్థాన్లో చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. లాహోర్కు సుమారు 130 కిలోమీటర్ల దూరంలోని నరోవాల్ జిల్లా సిరాజ్ గ్రామంలో ఈ పురాతన ఆలయం ఉంది. దాదాపు 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం 100 నుంచి 125 ఏళ్లకు పైగా పురాతనమైనదిగా చెబుతున్నారు. ఆగస్టు 21న ఆలయం కూల్చివేతకు గురైనట్లు సమాచారం.
మదర్సా కోసం ఆలయాన్ని కూల్చారా?
ఈ ఆలయాన్ని మతపరమైన తీవ్రవాద భావజాలం ఉన్న కొందరు వ్యక్తులు కావాలనే కూల్చివేశారని పాకిస్థాన్ మసీహా మిల్లత్ పార్టీ (PMMP) ఆరోపించింది. ఆలయానికి సంబంధించిన భూమిని సమీపంలోని మదర్సాలో కలిపేందుకు ఈ చర్యకు పాల్పడ్డారని ఆ పార్టీ పేర్కొంది. ఆలయ శిఖరానికి సంబంధించిన లోహం, ఇతర నిర్మాణ సామగ్రి, శిథిలాల్లోని ఇటుకలను కూడా కూల్చివేత అనంతరం అక్కడి నుంచి తరలించినట్లు PMMP అధ్యక్షుడు అస్లం పర్వేజ్ సహోత్రా ఆరోపించారు. ఈ ఘటనలో నిషేధిత మితవాద ఇస్లామిక్ సంస్థ తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్థాన్ (TLP)కు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఆలయ కూల్చివేతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆగస్టు 28న పంజాబ్ అదనపు హోం కార్యదర్శిని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు PMMP అధ్యక్షుడు అస్లం పర్వేజ్ సహోత్రా తెలిపారు. ఆలయాన్ని రక్షించడంలో విఫలమైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆలయానికి ఆనుకుని ఉన్న భూమిని గతంలో ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు (ETPB) మదర్సా కోసం లీజుకు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే కొన్నేళ్ల పాటు అద్దె చెల్లించకపోవడం, నిర్దేశిత ప్రయోజనం కోసం భూమిని వినియోగించకపోవడంతో ఆ లీజును రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం కొందరు వ్యక్తులు ఆస్తిలోని కొన్ని ప్రాంతాలను అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు.
ఆలయ కూల్చివేతను హిందూ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆలయాన్ని అదే ప్రాంతంలో తిరిగి నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. నరోవాల్ జిల్లా శాంతి కమిటీ, పాక్ ధర్మస్థాన్ హిందూ కమిటీ సభ్యుడు రతన్ లాల్ మాట్లాడుతూ.. ఆలయానికి, దాని పరిసర ఆస్తులకు రక్షణ కల్పించడంలో జిల్లా యంత్రాంగం, ETPB విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ETPB సీనియర్ అధికారి రాణా ఇఫ్తిఖార్ మాత్రం ఆలయం భారీ వర్షాల కారణంగా కూలిపోయిందని తెలిపారు. తమ అధికారిక రికార్డుల్లో ఆలయానికి సంబంధించిన పేరు లేదని, అయితే నిర్మాణం 100 నుంచి 125 ఏళ్లకు పైగా పురాతనమైనదని చెప్పారు. ఆలయ పునర్నిర్మాణంపై ETPB ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ETPB అధికారుల సమాచారం ప్రకారం.. ఆలయానికి ఆనుకుని ఉన్న భూమిని మదర్సా కోసం లీజుకు ఇచ్చారు. అయితే ఆలయ స్థలాన్ని మాత్రం ఎవరికీ లీజుకు ఇవ్వలేదని అధికారులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. గతంలోనే ఆలయం చుట్టూ భద్రతాపరమైన సమస్యలు, నష్టం జరిగే అవకాశం ఉందని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయని సహోత్రా తెలిపారు. 2026 జనవరిలో ETPB జారీ చేసిన ఆదేశాల్లో మదర్సా లీజు హక్కులను రద్దు చేసి, అక్రమ ఆక్రమణదారులను తొలగించి ఆస్తిని సీజ్ చేయాలని సూచించినప్పటికీ.. ఆ ఆదేశాలు అమలు కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై వివాదం కొనసాగుతోంది. ఆలయాన్ని పునర్నిర్మించడంతో పాటు పంజాబ్లోని హిందూ ఆలయాలు, సిక్కు గురుద్వారాలు, క్రైస్తవ చర్చిలు, వాటి పరిసర ఆస్తులకు భద్రత కల్పించాలని మైనారిటీ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

