Sushila Karki: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా “సుశీలా కర్కీ”.. ఎవరు ఈమె..?

  • నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కీ..
  • నేపాల్ చీఫ్ జస్టిస్‌గా పనిచేసిన తొలి మహిళ..
  • సుశీలా కర్కీకి మద్దతుగా నిలిచిన యువత..
Sushila Karki

Sushila Karki

Sushila Karki: సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా జెన్-జెడ్ యువతి చేసిన నిరసనలు నేపాల్‌లో హోరెత్తాయి. సోమవారం జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపైకి భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో 19 మంది మరణించారు. దీంతో, ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీతో పాటు ఆయన ప్రభుత్వంలో మంత్రులు ఒక్కొక్కరిగా రాజీనామా చేశారు. ప్రస్తుతం, దేశాన్ని ఆర్మీ తన కంట్రోల్‌కి తీసుకుంది.

ఇదిలా ఉంటే, నేపాల్‌కు కాబోయే తదుపరి ప్రధానమంత్రిపై చర్చించడానికి 5000 మందికి పైగా యువకులు వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. నేపాల్ మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీ వైపే యువత ఎంపికగా నిలిచారు. మొదట ఖాట్మాండు మేయర్ బాలెన్ షా వైపు యువత ఆసక్తి చూపించినప్పటికీ, ఆయనను సంప్రదించడానికి పదేపదే చేసిన ప్రయత్నాలకు ఆయన స్పందించలేదని నిరసనకు నేతృత్వం వహించిన ప్రతినిధులు మీడియాకు చెప్పారు.

కర్కీతో పాటు నేపాల్ శిద్యుత్ అథారిటీ చీఫ్ కుల్మాన్ ఘిసింగ్, యువ నేత సాగర్ ధకల్, ధరణ్ మేయర్ హర్కా సంపాంగ్ పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. మరోవైపు, నేపాల్ ప్రముఖ యూట్యూబర్ రాండన్ నేపాలీకి కూడా మద్దతు లభించింది. అయితే, వేరే వారు ఎవరూ ఈ పదవిని తీసుకోకుంటే తాను ముందుకు వస్తానని చెప్పారు.

సుశీలా కర్కీ ఎవరు..?

72 ఏళ్ల సుశీలా కర్కీ, నేపాల్ చరిత్రలో చీఫ్ జస్టిస్‌గా పనిచేసి మొదటి మహిళ. అప్పటి ప్రధాని కెపి శర్మ ఓలి నేతృత్వంలోని రాజ్యాంగ మండలి సిఫార్సు మేరకు ఆమెను 2016లో అప్పటి అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి నియమించారు. న్యాయవ్యవస్థలోకి ప్రవేశించే ముందు కర్కీ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. అవినీతి కేసులో మంత్రిని జైలుకు పంపించారు. ఈమె 1975లో వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ పొందారు.