Nepal Flash Floods: నేపాల్‌లో వరద విలయం.. 105 మంది భారతీయులు గల్లంతు..

  • నేపాల్‌లో వరద విధ్వంసం..
  • భోటెకోషి నది ఉద్ధృతికి అతలాకుతలమైన హిమాలయ దేశం..
  • వరదల్లో 105 మంది భారతీయులతో సహా 384 మది గల్లంతు..
Nepal Floods

Nepal Floods

Nepal Flash Floods:  టిబెన్ నుంచి వచ్చిన భారీ వరదలు నేపాల్‌లో పెను విలయాన్ని సృష్టించింది. భోటెకోషి నది ఉద్ధృతంగా ప్రవహించడంతో నువాకోట్, ధాదింగ్ జిల్లాల్లో భారీ నష్టం జరిగింది. ఇప్పటివరకు కనీసం 8 మృతదేహాలను గుర్తించినట్లు నేపాల్ అధికారులు తెలిపారు. గల్లంతైన వారిలో 105 మంది భారతీయులు ఉన్నట్లు నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది.

105 మంది భారత టూరిస్టులు గల్లంతు..

నేపాల్ టూరిజం బోర్డు చెప్పిన వివరాల ప్రకారం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం 384 మది పర్యాటకులు గల్లంతైనట్లు సమాచారం. ఇందులో 291 మంది విదేశీయులు కాగా, 93 మంది నేపాల్ పౌరులు ఉన్నారు. గల్లంతైన విదేశీయుల్లో 105 మంది భారతీయలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రసువా జిల్లాలో 26 మంది నేపాల్ పోలీస్ సిబ్బంది ఆచూకీ కూడా తెలియడం లేదని చెప్పారు. ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ఏడుగురు సిబ్బంది కూగా గల్లంతైన వారిలో ఉన్నారు.

విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసం..

వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్కూ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 20 మందిని రక్షించారు. రెస్క్యూ కోసం 15 హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. భారీ వరదల కారణంగా ఉత్తర నేపాల్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. ఆ ప్రాంతాల్లోని రోడ్లు, విద్యుత్ మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరదల కారణంగా జల విద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నాయి. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం రసువాగఢి, చిలిమే, త్రిశూలి 3A, త్రిశూలి 3B హబ్ 220 కేవీ సబ్‌స్టేషన్, త్రిశూలి హైడ్రోపవర్ స్టేషన్, దేవీఘాట్ హైడ్రోపవర్ స్టేషన్ సహా కనీసం ఆరు ప్రధాన విద్యుత్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.

నేపాల్ ప్రధాని బాలెన్ షా అత్యవసర సమావేశం..

నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా పరిస్థితిని సమీక్షించేందుకు నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వైద్య బృందాలు, స్కౌట్స్, రెడ్ క్రాస్ తో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు.

నేపాల్ పోలీసులు ప్రజలను నదీ పరివాహక ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరించారు. భోటెకోషి నదిలో టిబెట్ వైపు నుంచి భారీగా వరద నీరు ప్రవేశించడంతో త్రిశూలి నది పరివాహక ప్రాంతంలోని నువాకోట్, ధాదింగ్, చిత్వన్, గోర్ఖా తదితర జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.