ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం అందరికీ కంటితడి పెట్టిస్తోంది. 14 నెలల మనవరాలి చిన్న శవపేటిక అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా ప్రాంగణానికి ఖమేనీ భౌతికకాయాన్ని తీసుకురాగా.. యుద్ధం ప్రారంభమైన తొలి దశలో ఆయనతో పాటు ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యుల శవపేటికలను కూడా అక్కడ ఉంచారు. మృతుల్లో ఖమేనీ అల్లుడు, కుమార్తె, కోడలుతో పాటు కేవలం 14 నెలల వయస్సు ఉన్న మనవరాలు కూడా ఉండటం విషాదాన్ని మరింత పెంచింది. ప్రస్తుతం ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ భార్య కూడా ఉన్నట్లు సమాచారం.
అంత్యక్రియల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 14 నెలల చిన్నారి మనవరాలి చిన్న శవపేటిక అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ దృశ్యం అక్కడికి వచ్చిన ప్రజలను, విదేశీ ప్రతినిధులను తీవ్ర భావోద్వేగానికి గురి చేసింది. ఖమేనీ కుటుంబ సభ్యుల మరణంతో ఇరాన్లో విషాద ఛాయలు అలుముకోగా, అంత్యక్రియలకు హాజరైన లక్షలాది మంది ప్రజలు నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి సంతాపం తెలిపారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఖమేనీతో పాటు మృతి చెందిన కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించారు.
ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ దాడిలో ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, కీలక నేతలంతా హతమయ్యారు. దాదాపుగా 100 రోజులకు పైగా అంత్యక్రియలు జరపకుండా ఉంచారు. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు నెలకొన్న నేపథ్యంలో తాజాగా అంత్యక్రియలు చేపట్టారు. జూలై 9న ఖమేనీ అంత్యక్రియలు జరగనున్నాయి. అప్పటి వరకు ఆయా పవిత్ర స్థలాల సందర్శన జరగనుంది.
Tiny coffin of Khamenei's grandchild, killed in US-Israel strikes, shown during the funeral ceremony https://t.co/xazL42Xjvf pic.twitter.com/ho4IKkAG9a
— RT Intl (@RT_on_X) July 3, 2026

