దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అనేక మందిని విచారించారు. అంతేకాకుండా ప్రధాన నిందితురాలు సియా గోయల్ను సంఘటనాస్థలికి తీసుకెళ్లి సీన్ రీ-కన్స్ట్రక్షన్ కూడా చేశారు. ఇక సియా సోదరుడు సాహిల్ గోయల్ను సోమవారం 10 గంటల పాటు పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఇక విచారణ అనంతరం ఒక మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించాడు.
సియా తనతో కేతన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పిందని.. చేతన్తో తన సంబంధం కొనసాగించాలనే ఆలోచన లేదని కూడా చెప్పిందని వెల్లడించాడు. అయితే చేతన్ విషయంలో మాత్రం కన్ఫ్యూజ్గా ఉండేదని పేర్కొన్నాడు. అయితే హత్య కేసులో సాహిల్ పాత్ర ఏమైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తూ విచారణ కొనసాగిస్తున్నారు. సియా-చేతన్ మధ్య ఉన్న సంబంధం గురించి సాహిల్కు ముందే తెలుసా? తెలిసినా కుటుంబ సభ్యులకు ఉద్దేశపూర్వకంగానే చెప్పలేదా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అతడిని అధికారికంగా నిందితుడిగా చేర్చకపోయినా.. కేసులో అతని పాత్రపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటర్వ్యూలో సాహిల్…
“సియా తన జీవితాన్ని కేతన్తోనే గడపాలనుకుంటున్నానని చెప్పింది. చేతన్తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. అతడు కేవలం స్నేహితుడేనని నమ్మించింది. అందుకే ఈ విషయం గురించి మా తల్లిదండ్రులకు నేను చెప్పలేదు.” అని తెలిపాడు. చేతన్తో ఉన్న అనుబంధం గురించి కూడా తనతో మాట్లాడేదని సాహిల్ చెప్పాడు. “చేతన్తో స్నేహం ఉందని… అతని సాంగత్యం తనకు నచ్చుతుందని చెప్పేది. కానీ అది ప్రేమా? స్నేహమా? అనే విషయంలో తానే కన్ఫ్యూజ్గా ఉండేది. యుక్తవయసులో ఇలాంటి అయోమయం సహజమేనని నేను చెప్పాను. చివరికి కేతన్తోనే ముందుకు వెళ్లాలనుకుంటున్నానని చెప్పింది.” అని వివరించాడు.
అయితే పోలీసుల దర్యాప్తులో వేరే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. సియా.. కేతన్ను పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి లేదని, ఆ విషయాన్ని సాహిల్కు ముందే చెప్పినట్లు విచారణలో తేలిందని సమాచారం. అలాగే సియా-చేతన్ మధ్య ఉన్న సంబంధం గురించి కూడా సాహిల్కు పూర్తిగా తెలుసని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ కోసం విమానాశ్రయానికి వెళ్లే రోజు సియా వెళ్లేందుకు నిరాకరించిందని.. అప్పుడు సాహిల్ బలవంతంగా కారులో ఎక్కించాడని డ్రైవర్ తన వాంగ్మూలంలో చెప్పినట్లు సమాచారం. అలాగే బాలి ట్రిప్కు ముందు కేతన్ పాస్పోర్ట్ చించివేసిన ఘటన తర్వాత కూడా సాహిల్ మౌనంగా ఉండటం పోలీసులకు అనుమానాలు కలిగిస్తోంది.
ఈ ఘటనలన్నింటిని ఆధారంగా తీసుకుని పోలీసులు సాహిల్ను సోమవారం 10 గంటలకు పైగా విచారించారు. అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సియా, చేతన్తో కలిసి హత్యకు కుట్ర పన్నాడా? లేక అన్నీ తెలిసినా మౌనంగా ఉన్నాడా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
జూన్ 18న లోహగడ్ కోట దగ్గర కేతన్ అగర్వాల్ను అతని కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ కలిసి హత్య చేశారు. ప్రస్తుతం ఇద్దరూ పోలీసు కస్టడీలో ఉండగా.. నేరాన్ని అంగీకరించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. సాహిల్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతుండగా.. అతడిని ఇప్పటివరకు అధికారికంగా నిందితుడిగా ప్రకటించలేదు.

