NTV Telugu Site icon

Pakistan: కరాచీ దాడికి పాల్పడింది బీఎల్‌ఏ.. విదేశీ గూఢచార సంస్థతో సంబంధం..

Karachi Blast

Karachi Blast

Pakistan: ఇటీవల పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీలో చైనీయులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపుల పేలుడు కారణంగా ఇద్దరు చైనా పౌరులు మరణించగా, 17 మంది గాయపడ్డారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. చైనా-పాకిస్తాన్ సంబంధాలను దెబ్బతీసే లక్ష్యంతోనే దాడి జరిగినట్లు అక్కడి మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే పేలుడుపై పాక్ ప్రభుత్వం తయారు చేసిన ప్రాథమిక రిపోర్టులో విదేశానికి చెందిన గూఢచార సంస్థ సాయంతో ఈ దాడి జరిగిందని పాక్ మీడియా పేర్కొంది. పాకిస్తాన్-చైనా సంబంధాలను దెబ్బతీసే కుట్రలో భాగంగానే చైనా ఇంజనీర్లను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి బాంబు దాడి జరిగిందని ఉగ్రవాద నిరోధక విభాగం (సిటిడి) ఉగ్రవాద నిరోధక కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.

Read Also: Kakinada: చందాకి వచ్చి మహిళపై మత్తు మందు చల్లి సొమ్ము చోరీ

ఆదివారం, చైనా కార్మికులు కాన్వాయ్ లక్ష్యంగా బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలో జరిగిన దాడిలో ఇద్దరు చైనీయులు మరణించారు. పేలుడు పదార్థాలను పేల్చే ముందు గుర్తుతెలియని ఉగ్రవాది తన వాహనాన్ని చైనా జాతీయులు కాన్వాయ్‌కి దగ్గరగా నిలిచి ఉంచినట్లు నివేదిక పేర్కొంది. ఈ ఇద్దరు చైనీయులు కరాచీ శివారులోని పోర్ట్ ఖాసిమ్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీలో పనిచేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా వారి కాన్వాయ్‌పై దాడి జరిగింది.

దాడిలో 70-80 కిలోల పేలుడు పదార్థాలను కలిగి ఉన్నట్లు నివేదిక తెలిపింది. కరాచీలో జరిగిన ఘోరమైన ఆత్మాహుతి బాంబు దాడి తరువాత పాకిస్తాన్‌కు ఇంటర్-ఏజెన్సీ వర్కింగ్ గ్రూప్‌ను పంపినట్లు చైనా తెలిపింది. 60 బిలియన్ డాలర్ల విలువైన చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ఆధ్వర్యంలో పాకిస్తాన్ వ్యాప్తంగా జరుగుతున్న అనేక ప్రాజెక్టుల్లో చైనా సిబ్బంది పనిచేస్తోంది.

ముఖ్యంగా ఈ ప్రాజెక్టు ద్వారా బలూచిస్తాన్ ప్రాంతంలో గ్వాదర్ పోర్టు నిర్మాణం జరుగుతోంది. ఈ పోర్టుని చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్సుని కలిపేలా రోడ్డు, రైలు మార్గాలను అభివృద్ధి చేస్తున్నారు. అయితే, బలూచ్ ప్రజలు మాత్రం తమ వనరులను చైనా కొల్లగొడుతోందని భావిస్తున్నారు. దీంతోనే పాకిస్తాన్ ఆర్మీ, పోలీసులు లక్ష్యంగా చైనా జాతీయులు లక్ష్యంగా బీఎల్ఏ దాడులకు పాల్పడుతోంది. పాకిస్తాన్ నుంచి ఈ ప్రాంతాన్ని విముక్తం చేయాలని ఈ గ్రూపు అనేక ఏళ్లుగా పోరాటం చేస్తోంది.