ఇరాన్-అమెరికా మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. తాజా ఒప్పందం లెబనాన్కు వర్తించకపోవడంతో ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో 254 మంది చనిపోయారు. దీంతో ఈ వ్యవహారాన్ని ఇరాన్ జీర్ణించుకోలేకపోతుంది. హార్ముజ్ జలసంధిపై మళ్లీ కఠిన ఆంక్షలు విధించింది.
అయితే ఈ వ్యవహారంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్ కోసం కాదని.. ఈ విషయంలో ఇరాన్ పొరబడుతోందని తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్కు వర్తిస్తుందనే దానికి అమెరికా అంగీకరించలేదని జేడీ వాన్స్ తేల్చి చెప్పారు. అయితే ఈ ఒప్పందంలో లెబనాన్ కూడా ఉందని టెహ్రాన్ ప్రతినిధులు భావించారని.. అయితే వాస్తవానికి అమెరికా దానికి అంగీకరించలేదన్నారు. ఇది ఒక సహేతుకమైన అపార్థం వల్ల జరిగిందని అనుకుంటున్నానని బుడాపెస్ట్లో విలేకరులతో జేడీ వాన్స్ అన్నారు.
అయితే మధ్యవర్తిగా ఉన్న పాకిస్థాన్ వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా ఉందని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. జేడీ వాన్స్-షరీఫ్ వ్యాఖ్యలు పొంతన లేకుండా ఉన్నాయి.
ఇస్లామాబాద్కు జేడీ వాన్స్ బృందం
ఇదిలా ఉంటే ఇరాన్తో శాంతి చర్చల బృందానికి జేడీ వాన్స్ నాయకత్వం వహించనున్నారు. తొలి విడత చర్చలు ఏప్రిల్ 11న ఇస్లామాబాద్లో జరగనున్నాయి. ఇందుకోసం జేడీ వాన్స్ బృందాన్ని ట్రంప్ పాకిస్థాన్కు పంపిస్తున్నారు. అయితే తాజాగా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో శాంతి చర్చలు ఎలా ముందుకు సాగుతాయన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
