ఇటలీలో భారతీయ మహిళలకు ఘోర అవమానం జరిగింది. బంగ్లాదేశ్ వెయిటర్ జాత్యహంకార బుద్ధిని ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారతీయ మహిళల బృందం ఇటలీలో పర్యటిస్తున్నారు. అయితే ఓ రెస్టారెంట్లో ఉన్నప్పుడు జాత్యహంకార వ్యాఖ్యలను ఎదుర్కొన్నారు. రెస్టారెంట్లో పనిచేస్తున్న బంగ్లాదేశ్కు చెందిన వెయిటర్ భారతదేశాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేయడంతో మహిళలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మహిళల్లో ఒకరు చిత్రీకరించగా.. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో వెయిటర్ భారతీయ మహిళలతో వాగ్వాదానికి దిగుతూ భారతదేశాన్ని ఉద్దేశించి అనుచిత పదజాలం ఉపయోగించినట్లు కనిపిస్తోంది.
అయితే ఈ ఘర్షణకు అసలు కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియరాలేదు. రెస్టారెంట్ వెలుపల కూర్చున్న మహిళలతో మాట్లాడుతున్న సమయంలో వెయిటర్ వారిని ఉద్దేశించి ‘‘మీరు ఇండియా నుంచి వచ్చారు.’’ అంటూ అవమానకరంగా వ్యాఖ్యానించినట్లు వీడియోలో వినిపించింది. దీనికి స్పందించిన మహిళలు వెంటనే అతనిని ప్రశ్నించారు. ‘‘ముందుగా మీ భాషను అదుపులో పెట్టుకోండి. మేము మహిళలం’’. అంటూ గట్టిగా సమాధానం ఇచ్చారు. అయినప్పటికీ వెయిటర్ మరోసారి భారతదేశాన్ని అవమానించేలా మాట్లాడినట్లు వీడియోలో నమోదైంది.
వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఇద్దరు పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం వెయిటర్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాడు. భారతదేశాన్ని అవమానించినందుకు క్షమించండని చెప్పినట్లు వీడియోలో కనిపించింది. అయితే మహిళలు కేవలం సాధారణ క్షమాపణతో సరిపెట్టలేదు. మీరు భారతదేశాన్ని అవమానించారని స్పష్టంగా అంగీకరించి క్షమాపణ చెప్పండి అంటూ నిలదీశారు. దీంతో వెయిటర్ మరింత వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. భారతీయ మహిళలు ధైర్యంగా స్పందించి దేశ గౌరవాన్ని కాపాడారని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. “అతనిపై అధికారిక ఫిర్యాదు చేయాల్సింది. శిక్ష పడాల్సిందే” అని ఒకరు వ్యాఖ్యానించగా.. “భారతదేశానికి క్షమాపణ చెప్పించిన మీ ధైర్యానికి సెల్యూట్. మీరు నిజమైన దేశభక్తులు” అంటూ మరొకరు ప్రశంసించారు. ఈ ఘటన విదేశాల్లో భారతీయులు ఎదుర్కొనే వివక్ష, జాత్యహంకార ప్రవర్తనపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఈ వీడియో వివిధ సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా షేర్ అవుతోంది.

