ISIS: ఉగ్రవాద సంస్థ ఐసిస్ దురాగతాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా మహిళల్ని ఎలా హింసించాలి, వారిని ఎలా లైంగికంగా వేధించాలి అనే దానిపై ఏకంగా ఒక పుస్తకాన్నే రాసింది. ప్రజల్ని చంపడమే కాకుండా, మహిళల్ని బానిసలుగా చేసుకుని వారిని ఎలా చూడాలనే దానిపై లిఖితపూర్వక నియమాలను రూపొందించింది. ఆస్ట్రేలియా కోర్టులో ‘‘ఐసిస్ వధువు’’గా పిలువబడే మహిళ విచారణ సందర్భంగా ఈ ఉగ్రసంస్థ క్రూరత్వానికి సంబంధించిన పత్రాలను, హ్యాండ్ బుక్ వెలుగులోకి వచ్చాయి.
మహిళల్ని హింసించడానికి హ్యాండ్ బుక్:
ఖైదీలు, బానిసలకు సంబంధించి ప్రశ్నలు, సమాధానాలు కలిగిన ఒక పుస్తకాన్ని ఐసిస్ పరిశోధన, ఫత్వా విభాగం రూపొందించిందని కోర్టుకు తెలిపారు. మహిళల్ని బానిసలుగా మార్చడం, వారిని కొనడం, అమ్మడం, బహుమతిగా ఇవ్వడం, ఇతర వ్యక్తులతో మార్పిడి చేసుకోవడం, వారిపై అత్యాచారాలు చేయడం వంటి వాటిని ఈ పుస్తకంలో పొందుపరిచారు. మహిళా ఖైదీలను శిక్షించడం, వారితో వ్యవహరించే పద్ధతులను ఈ బుక్లో ప్రస్తావించారు.
యజీదీ మహిళలపై అకృత్యాలు:
ముఖ్యంగా యజీది మహిళల్ని బంధించడం, వారిపై అత్యాచారాలకు పాల్పడటం, బానిసలుగా చేయగాన్ని సమర్థించే ప్రయత్నాలు ఈ పత్రాలు, బుక్లో ఉన్నాయి. 2014లో ఆగస్టులో ఇరాక్లోని సింజర్ ప్రాంతంపై ఐసిస్ దాడులు చేసి, యజీదీ ప్రజలపై అకృత్యాలకు పాల్పడినట్లు కోర్టుకు తెలిపారు. ఈ దాడిలో వేల మరణించారు. సుమారు 6800 మంది యజీదీ మహిళలు, పిల్లల్ని ఐసిస్ బందీలుగా పట్టుకుందని అంచనా. వీరిలో చాలా మంది ఆచూకీ నేటికి తెలియలేదు. అధికారులు కోర్టుకు చెప్పిన దాని ప్రకారం.. పిల్లల్ని వివిధ మిలీషియాల మధ్య కొని అమ్మాలు. చాలా మందిని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించారు. వీరిపై పదే పదే అత్యాచారాలకు పాల్పడ్డారు.
యజీదీ బాలికపై అరాచకాలు:
ఈ కేసు విచారణ సమయంలో యజీదీ బాలికపై జరిగిన వేధింపుల గురించి ప్రస్తావనకు వచ్చింది. 15 ఏళ్ల బాలికను ఐసిస్ ఉగ్రవాదులు ఆమె కుటుంబంపై దాడి చేసి, ఆమె తల్లి, సోదరుల్ని చంపి ఆమెను బందీగా పట్టుకున్నారు. బాలికను పలువురు పురుషుల మధ్య అమ్మారు. పదే పదే అత్యాచారాలకు పాల్పడ్డారు. చిత్ర హింసలకు గురిచేసినట్లు కోర్టు విచారణలో వెల్లడైంది. ఆమెను ఆ తర్వాత ఒక కుటుంబం 10,000 అమెరికన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ బాలికను ఇంటి పనులు చేయడానికి బంధించారని, పదే పదే అత్యాచారాలకు గురైందని, ఆమెకు స్వేచ్చగా తిరిగే అవకాశం ఇవ్వలేదని దర్యాప్తు అధికారులు ఆరోపించారు. యజీదీ మహిళల్ని కేవలం లైంగిక బానిసలుగా మాత్రమే చూసినట్లు కోర్టుకు వివరించారు.
