Donald Trump: ఇరాక్కు చెందిన “ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్” (Islamic Resistance in Iraq)గా తనను తాను గుర్తించుకున్న ఒక సాయుధ సంస్థ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేసిన వారికి 10 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.85 కోట్లకు పైగా) బహుమతి ప్రకటించినట్లు పేర్కొంది. ఈ ప్రకటనను తమ అనుబంధ కమ్యూనికేషన్ ఛానెళ్ల ద్వారా విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే, ఈ ప్రకటనను స్వతంత్రంగా ధృవీకరించలేదు. అలాగే, ఈ వార్త వెలువడే సమయానికి వైట్ హౌస్ లేదా అమెరికా అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
ఖురాన్ వాక్యంతో ప్రారంభమైన ప్రకటన
సంస్థ విడుదల చేసిన ప్రకటనలో “అల్లాహ్ పేరుతో” అనే ఇస్లామిక్ ప్రార్థనతో ప్రారంభించి, ఖురాన్లోని ఒక వాక్యాన్ని ఉటంకించింది. అనంతరం, అమెరికా ప్రభుత్వం నైతిక విలువలు కోల్పోయిందని ఆరోపిస్తూ, ట్రంప్ ఇప్పటికీ ఇరాన్ మద్దతు ఉన్న కీలక నాయకులు ఖాసిం సొలేమాని, అబూ మహ్దీ అల్-ముహందిస్ వారసత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించింది.
ట్రంప్పై 10 మిలియన్ డాలర్ల రివార్డు
ప్రకటనలో ట్రంప్ తలపై 10 మిలియన్ డాలర్ల బహుమతి ప్రకటించినట్లు తెలిపింది. అలాగే, “ఇరాకీల రక్తాన్ని చిందించిన, ప్రజలను నిరాశ్రయులను చేసిన, మా నాయకులను, పిల్లలను, పండితులను లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఉండదు” అని హెచ్చరించింది. చివరగా, “ట్రంప్కు మా నుంచి అవమానం తప్ప మరేమీ దక్కదు. అమరుల పేరిట మేము ప్రమాణం చేస్తున్నాం. అణచివేత కోటలు కూలిపోయే వరకు మా పోరాటం కొనసాగుతుంది” అని పేర్కొంది.
సొలేమాని, అల్-ముహందిస్ హత్యలే వివాదానికి కేంద్రం
2020 జనవరిలో బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కుద్స్ ఫోర్స్ కమాండర్ ఖాసిం సొలేమాని, ఇరాక్ మిలీషియా నాయకుడు అబూ మహ్దీ అల్-ముహందిస్ మరణించారు. ఈ ఘటన అనంతరం అమెరికా, ఇరాన్, ఇరాన్ మద్దతు ఉన్న సాయుధ సంస్థల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అప్పటి నుంచి ఇరాన్ అనుకూల మిలీషియా గ్రూపులు అమెరికా ప్రయోజనాలు, ఉన్నతాధికారులపై పలుమార్లు బెదిరింపులు చేస్తూ వస్తున్నాయి. ఈ బెదిరింపులకు సొలేమాని, అల్-ముహందిస్ హత్యలనే కారణంగా పేర్కొంటున్నాయి.
అధికారిక స్పందన లేదు
ప్రస్తుతం ఈ ప్రకటనపై వైట్ హౌస్, అమెరికా చట్ట అమలు సంస్థలు లేదా ఇతర అధికారిక వర్గాల నుంచి ఎలాంటి స్పందన వెలువడలేదు. అయితే, అధికారంలో ఉన్న లేదా మాజీ దేశాధినేతలపై బహిరంగంగా వచ్చే ఇలాంటి బెదిరింపులను భద్రతా సంస్థలు అత్యంత తీవ్రంగా పరిగణిస్తాయి. ప్రస్తుతం ఈ ప్రకటనపై సంబంధిత భద్రతా సంస్థలు నిశితంగా నిఘా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

