మధ్యప్రాచ్యం యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా కొత్త భయాందోళనలు రేకెత్తుతున్నాయి. గత రాత్రి ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఖతార్ ఎల్ఎన్జీ గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో అంతర్జాతీయ సమాజమంతా ఉలిక్కిపడింది. మొత్తం ప్రపంచ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు ఘోరంగా పతనం అయ్యాయి. గ్యాస్, చమురు సమస్య మరింత సంక్షోభంలోకి నెట్టింది.
ఇప్పుడు తాజాగా కొత్త భయాందోళనలు మొదలవుతున్నాయి. ఇరాన్ తన వ్యూహాన్ని మార్చుకుందని.. తదుపరి లక్ష్యం హార్ముజ్ జలసంధిలో ఉన్న ప్రపంచ ఇంటర్నెట్ కేబుళ్లే అని.. హౌతీలతో కలిసి వాటిని కత్తిరించబోతుందని అంతర్జాతీయ కథనాలు కోడైకూస్తున్నాయి. ఈ మేరకు ‘‘రెస్ట్ ఆఫ్ వరల్డ్’’ పత్రిక, అలాగే న్యూయార్క్ టైమ్స్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.
ఇప్పటికే హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ఇంధన సంక్షోభాన్ని సృష్టించింది. ఆయా దేశాలకు చెందిన ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ ట్రాఫిక్ను మోసుకెళ్లే కీలకమైన సముద్ర గర్భ కేబుళ్లును కూడా కత్తిరించబోతున్నట్లుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అదే గనుక జరిగితే మాత్రం ప్రపంచం అల్లకల్లోలం అయి పోతుంది. అన్ని వ్యవస్థలు స్తంభించిపోతాయి. కీలక రంగాలు అన్ని కూడా మూతపడిపోతాయి. కోవిడ్-19 కారణంగా ఏర్పడిన సంక్షోభం కంటే భయంకరమైన పరిస్థితులు దాపురిస్తాయి.
ముఖ్యంగా భారతదేశంతో పాటు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఘోరంగా దెబ్బతింటాయి.
ఇక ఎర్ర సముద్రంలో బాబ్ ఎలా-మండేబ్ అనే ఒక జలసంధి ఉంది. అక్కడ కూడా ఇరాన్ అనుచరులైన హౌతీలు ఘోరంగా దాడి చేయొచ్చనే భయాందోళనలు మొదలయ్యాయి. ప్రపంచంలోని డిజిటల్ ప్రధాన మార్గాలు ఈ జలసంధి గుండానే వెళ్తున్నాయి. జలసంధికి అడ్డంగా సముద్ర మైన్లు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇవి గనుక పేలితే మాత్రం ప్రపంచ దేశాలు అల్లాడిపోవడం ఖాయం. కీలక కేబుళ్లు అన్ని కూడా హర్ముజ్, బాబ్ ఎలా-మండేబ్ ప్రదేశాల్లోనే ఉన్నాయి. ఇవి ఆగిపోతే వీడియో కాల్స్, ఈ-మెయిల్స్, బ్యాంకింగ్, ఏఐ సేవలు, ప్రపంచ ఇంటర్నెట్ మొత్తం ఆగిపోతాయి.
ప్రస్తుతం ఎర్ర సముద్రం, హోర్ముజ్ జలసంధిలో కనీసం 20 సముద్రగర్భ కేబుళ్లు ఉన్నాయి. ఎర్ర సముద్రంలోనే దాదాపు 17 కేబుళ్లు ఉన్నాయి. ప్రపంచ టెలికాం, డేటా సెంటర్, డిజిటల్ మౌలిక సదుపాయాలు ఇక్కడే ఉన్నాయి. ఈ కేబుళ్లు ఐరోపా, ఆసియా, ఆఫ్రికాలను కలుపుతూ ఇంటర్నెట్ ట్రాఫిక్లో ప్రధాన వాటాను కలిగి ఉన్నాయి. ఇక హోర్ముజ్ జలసంధిని దాటే కేబుళ్లు కూడా అత్యంత ముఖ్యమైనవి. పర్షియన్ గల్ఫ్లో చురుకుగా ఉన్న సముద్రగర్భ కేబుళ్లు ఏఏఈ-1, ఫాల్కన్, గల్ఫ్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కేబుల్ సిస్టమ్ ఉన్నాయి. ఈ లైన్లు భారతదేశ విదేశీ డేటా కనెక్షన్లకు నేరుగా మద్దతు ఇస్తాయి.
2024లో గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం జరిగినప్పుడు హమాస్కు సంఘీభావంగా హౌతీలు జరిపిన దాడులతో ఎర్ర సముద్రంలోని అనేక కేబుల్స్ దెబ్బతిన్నాయి. ఆసియా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ వేగం తీవ్రంగా పడిపోయింది. మరమ్మతులకు నెలల సమయం పట్టింది. ఇప్పుడు గనుక మరోసారి దాడి చేస్తే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విఘాతం కలుగుతుందని ఇంటర్నెట్ విశ్లేషకుడు డగ్ మాడోరీ హెచ్చరించాడు.
అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి పెద్ద టెక్నాలజీ సంస్థలు యూఏఈ, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల్లో భారీ డేటా సెంటర్లను నిర్మించడానికి బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెట్టాయి. ఇలాంటి తరుణంలో ఇంటర్నెట్ కేబుళ్లకు అంతరాయం కలిగితే మాత్రం సంక్షోభం పీక్ స్టేజ్లోకి వెళ్లిపోతుంది. ఈ నష్టం కేవలం ఫోన్లు, వెబ్సైట్లకే పరిమితం కాదని.. బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు, ఆస్పత్రులు, ఏఐ వ్యవస్థలు అన్నీ దెబ్బతింటాయి. మొట్టమొదటిగా గల్ఫ్ దేశాలు భారీగా నష్టపోతాయి. అటు తర్వాత ఐరోపా దేశాలు తీవ్ర ఇబ్బందులు పడతాయి. ప్రస్తుతానికైతే కేబుళ్లు బాగానే పనిచేస్తున్నాయి. ఒకవేళ మందుపాతరలు పేలితే మాత్రం ప్రమాదం ఇంతకు ముందెన్నడూ లేనంత తీవ్రంగా ఉంటుంది.
